ఈసీ అర్ధరాత్రి ఆదేశంపై బీజేపీ ఆగ్రహం 

ఈసీ అర్ధరాత్రి ఆదేశంపై బీజేపీ ఆగ్రహం 

బ్యాలెట్‌ పేపర్‌పై స్వస్తిక్‌ గుర్తే కాకుండా.. ఏ మార్కర్‌ పెన్నుతో టిక్కు పెట్టినా ఆఓటును పరిగణనలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సర్క్యులర్‌ జారీ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ అధికారులకు మాత్రమే జారీ చేసిన ఆ సర్క్యులర్‌ వెనుక ఆంతర్యం ఏంటని ఎస్‌ఈసీని నిలదీశారు.

ప్రగతిభవన్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఎన్నికల కమిషనర్‌ ఈ సర్క్యులర్‌ జారీ చేశారని  ఆయనఆరోపించారు. తక్షణం ఆ సర్క్యులర్‌ను రద్దుచేయాలని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని బాధ్యులైన అధికారులను సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సర్క్యులర్‌పై అవసరమైతే, హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. 

అయితే, కౌంటింగ్‌ను మాత్రం అడ్డుకోబోమని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు గుణపాఠం తప్పదని సంజయ్ హెచ్చరించారు. ఎస్‌ఈసీని గ్యాంబ్లర్‌గా అభివర్ణించిన సంజయ్‌.. ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు. 

అలాగే, పోలింగ్‌ రోజున మధ్యాహ్నం 3 గంటల వరకూ గంట గంటకూ పోలింగ్‌ శాతం వివరాలు ఇచ్చిన అధికారులకు సాయంత్రం 5-6 గంటల నడుమ జరిగిన పోలింగ్‌ శాతం వెల్లడించడానికి అర్ధరాత్రి దాకా ఎందుకు పట్టిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సాయంత్రం 4-6 గంటల వరకు జరిగిన పోలింగ్‌ను టీఆర్‌ఎస్‌ ఓ పథకం ప్రకారం పెంచిందని దుయ్యబట్టారు. 

సీఎస్‌, డీజీపీ, మాజీ డీజీపీ, ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు స్కెచ్‌ వేసి, జీహెచ్‌ఎంసీ ఆఫీసులో అర్ధరాత్రి కూర్చుని టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా పోలింగ్‌ శాతాన్ని మార్చారని ధ్వజమెత్తారు. ఎంపిక చేసుకున్న డివిజన్లలో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు రిగ్గింగ్‌ చేశాయని ఆరోపించారు. ఘన్సీబజార్‌లో 93 శాతం పోలింగ్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ఎస్‌ఈసీని సంజయ్‌ నిలదీశారు.