గోదావరి డెల్టాలో రబీకి నీరు నిలిపివేత 

గోదావరి డెల్టాలో రబీకి నీరు నిలిపివేత 
ఏప్రిల్‌ నుండి పోలవరం కాపర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభమవుతాయని పోలవరం ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మేడపాటి నాగిరెడ్డి  ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్చి 31 నుండి గోదావరి నుండి పోలవరానికి నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు ఉభయ గోదావరి జిల్లాల ఇరిగేషన్‌ ఎడ్వైజరీ బోర్డ్‌ (ఐఎబి) సమావేశంలో తెలిపారు. 
 
కాఫర్‌డ్యామ్‌కు చెందిన కాప్‌ -3 (300 మీటర్ల పొడవైన) నిర్మాణ పనులు ఏప్రిల్‌ -జూన్‌ల మధ్య జరగనున్నాయని, వచ్చే ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయనున్నామని చెప్పారు. మార్చి 31 వరకు అత్యధికంగా తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. 
 
రబీ సీజన్‌ కోసం ఏప్రిల్‌ మధ్యలో గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయాలన్న రైతుల అభ్యర్థనపై నాగిరెడ్డి స్పందిస్తూ  రబీ సీజన్‌లో 120-130 రోజుల వరి రకానికి బదులుగా 90 రోజుల్లో పంట చేతికొచ్చే రకాన్ని వేయాలని రైతులకు సూచించారు. 
 
పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ప్రణాళిక ప్రకారం షెడ్యూల్‌ను పూర్తి చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. తాగు నీటికి, పశువుల నీటి అవసరాల కోసం చెరువులతో సహా వివిధ వనరులలో నీటిని నిల్వ చేసేలా చూడాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులు కోరారు.

రబీ సీజన్‌లో గోదావరి డెల్టాల్లో తూర్పుగోదావరిలో 4.36 లక్షల ఎకరాలు, పశ్చిమగోదావరి నుండి 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఇప్పటికీ ఖరీఫ్‌ సీజన్‌లో వరిసాగులో 75శాతం పూర్తి కాలేదని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి. మురళీధర్‌ రెడ్డి తెలిపారు. 

రబీ సీజన్‌లో 120-130 రోజుల వరి రకాన్ని ఎక్కువగా సాగుచేస్తారని, మార్చి నుండి నీటి సరఫరా కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1 నుండి నీటి సరఫరాను నిలిపివేయడంతో కోనసీమ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపుతుందని  తెలిపారు. 
 
పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత నిచ్చిన నేపథ్యంలో.. నీటి సరఫరాలో వ్యవసాయం, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ల మధ్య సమన్వయం అత్యవసరమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. మార్చి నుండి జూన్‌ వరకు పోలవరాన్ని కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం మూసివేస్తున్నందున నీటిపారుదల వ్యవస్థ నిర్వహణ కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు.