బిజెపితో పొత్తు కొనసాగుతోంది.. అన్నాడీఎంకే  ప్రకటన

మరో కొద్దీ నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో  బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందన్నారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి , అన్నాడీఎంకే చీఫ్ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం కీలక ప్రకటన చేశారు. 
 
చెన్నైలో రెండు రోజుల పర్యటన కోసం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా  శనివారంవచ్చిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకోండి. లోక్ సభ ఎన్నికల సందర్భంగా పెట్టుకున్న పొత్తు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ముఖ్యమంత్రి  పళనిస్వామి కూడా ప్రకటించారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. తాము ప‌దేళ్ల పాటు మంచి పాల‌న అందించామ‌ని, త‌మ కూట‌మే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 
 
మరోవంక,  అమిత్ ‌షా కూడా  అన్నాడీఎంకే   ప్రభుత్వం పనితీరును  ప్రశంసించారు. తమిళనాడులో కరోనాను నియంత్రించడానికి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు చేసిన కృషి అభినందనీయని పేర్కొన్నారు. తమిళనాడులో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. 
 
కుటుంబ రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన బుద్థి చెపుతున్నారని పరోక్షంగా ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలను ప్రస్తావిస్తూ ధ్వజమెత్తారు. తమిళనాడులో కూడా అదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2జీ స్ప్రెక్టం కుంభకోణంలో ఉన్న వ్యక్తులకు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కూడా లేదంటూ డీఎంకే నేతలకు చురకలంటించారు.
 
ఇలా ఉండగా, తమిళనాడుకు కేంద్రం కల్పిస్తున్న పథకాలు, నిధులు ఎంతమాత్రం సహాయం కాదని, అది పూర్తిగా రాష్ట్ర హక్కు అని అమిత్ షా స్పష్టం చేశారు. గతంలో పథకాలు, నిధులకు రాష్ట్రం నోచుకునేది కాదని, మోదీజీ రాష్ట్ర హక్కులకు భరోసాగా నిలిచారని చెప్పారు.
 
చెన్నైలో  రూ.67 వేల కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు  శంకుస్థాపన చేస్తూ తమిళనాడుకు అన్యాయం జరిగిందని డీఎంకే నేతలు ఒక్కోసారి అంటుండటం తన దృష్టికి వచ్చిందని చెబుతూ గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తమిళనాడుకు ఏం చేసిందో చెప్పగలదా? అంటూ  అమిత్ షా ప్రశ్నించారు.
 
డీఎంకే, కాంగ్రెస్ పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నారని, ఆ పదేళ్లలో తమిళనాడుకు ఎక్కువ సాయం అందిందో, తమ ప్రభుత్వ హయాంలో ఎక్కువ సాయం అందిందో చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని అమిత్‌షా సవాల్ చేశారు. 
 
రాజధాని చెన్నైతోపాటు తమిళనాడువ్యాప్తంగా రూ.67,000 కోట్ల భారీవ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో  చెన్నై మెట్రోరైలు ఫేజ్‌-2, చెన్నై ప్రజలకు తాగునీటి కోసం నిర్మించనున్న ఐదో రిజర్వాయర్‌ వంటివి ఉన్నాయి.