కోవిద్ సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ అవకాశాలు

దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ.. అన్నిచోట్లా భవిష్యత్తులో కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ సంభవించే అవకాశాలు ఉన్నాయని  హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా హెచ్చరించారు. 

మరో రెండేళ్లపాటు ఈవిధంగా అత్యంత అప్రమత్తతతో ప్రజలు వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి చలికాలం సీజన్‌ కంటే మనుషుల బాధ్యతారాహిత్యం, అజాగ్రత్తలే ఎక్కువ ఊతమిస్తాయని ఆయన హితవు చెప్పారు.

ప్రస్తుతం అభివృద్ధిచేస్తున్న కరోనా వ్యాక్సిన్లు పనిచేస్తాయా? పనిచేయవా? అనేది తేలేందుకే ఇంకొన్ని సంవత్సరాలు పడుతుందని మిశ్రా తెలిపారు.

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని తెలిపారు. దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల తగ్గుదల, పెరుగుదలను ప్రభావితం చేసే కనీసం 100కుపైగా హాట్‌స్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 

ఒడిశాలోని కొన్ని అనుమానాస్పద రీ ఇన్ఫెక్షన్‌ కేసుల శాంపిళ్లను పరీక్షించామని, వాటిలో కొన్ని తప్పుడు ‘పాజిటివ్‌’ కేసులు ఉన్నట్లు తేలిందని చెప్పారు.   కొవిడ్‌ రీ-ఇన్ఫెక్షన్లు చాలా అరుదుగా సోకుతుంటాయని ఆయన తెలిపారు.

మాస్క్‌లు ధరించడం, చేతులను శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి ఆరోగ్య రక్షణ చర్యలతో రాబోయే కరోనా వేవ్‌లను ఆలస్యం చేయడం తప్ప, ఇప్పుడు మరో మార్గం లేదని మిశ్రా స్పష్టంచేశారు.  

 ఇలా ఉండగా, కరోనా చికిత్సకు రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమాబ్‌ వంటి ఔషధాలను, ప్రయోగాత్మక థెరపీలను అతిగా వాడొద్దని న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) హెచ్చరించింది. అవన్నీ లేకుండా.. సాధారణ మందులతోనే ఎంతోమంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారని పలు అధ్యయనాల్లో తేలినట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు.