క్రమంగా ఊపందుకుంటున్న ఉద్యోగ నియామకాలు

కరోనా సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైన ఉద్యోగ నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఆగస్టులో 1,413గా ఉన్న జాబ్‌ పోస్టింగులు సెప్టెంబర్‌లో 24% వృద్ధిచెంది 1,755కు చేరినట్టు ‘నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌’ తన తాజా నివేదికలో తెలిపింది. 
 
ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉద్యోగ నియామకాలు ఫార్మా రంగంలో 44%, ఎఫ్‌ఎంసీజీ రంగంలో 43%, విద్య-బోధన రంగంలో 41%, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో 32%, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 44%, దాని అనుబంధ రంగంలో 29%, ఆతిథ్య-పర్యాటక రంగంలో 48% పెరిగాయని వెల్లడించింది. 
 
అలాగే బీపీవోలు, ఐటీ ఆధారిత సేవల రంగంలో 29%, బ్యాంకింగ్‌-ఆర్థిక సేవల రంగంలో 33% చొప్పున నియామకాలు పెరిగినట్టు తెలిపింది. ప్రభుత్వం అన్‌లాక్‌ చర్యలతో ఆర్థిక వ్యవస్థ ద్వారాలను తెరువడం, ప్రయాణాలు ఊపందుకోవడం ఇందుకు కారణమని పేర్కొన్నది.
 
మెట్రో నగరాలవారీగా చూస్తే పుణెలో ఉద్యోగ నియామకాలు సెప్టెంబర్‌లో 26% పెరిగాయని, 24% వృద్ధితో హైదరాబాద్‌, చెన్నై ద్వితీయ స్థానంలో నిలిచాయని నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. కేవలం 14% వృద్ధితో బెంగళూరు తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నట్టు తెలిపింది. 
 
అలాగే ద్వితీయశ్రేణి నగరాలైన అహ్మదాబాద్‌లో 34%, చండీగఢ్‌లో 39%, జైపూర్‌లో 36% చొప్పున నియామకాలు పెరిగినట్టు నౌకరీ డాట్‌కామ్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయెల్‌ పేర్కొన్నారు.