రాజధానిపై హైకోర్టులోనే తేల్చుకోండి 

సర్వోన్నత న్యాయస్థానంలోవై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపి హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
హైకోర్టు చేసే విచారణలోనే వాదనలు వినిపించుకోవాలని సూచించింది. మూడు రాజధానుల వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించేలా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా  ఫలాన గడువులోపు విచారణ ముగించాలని తాము ఆదేశించలేమని తేల్చిచెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ద్వివేది వాదనలు వినిపించారు. దీనిపై సీనియర్‌ న్యాయవాది నారీమన్‌ అభిప్రాయాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా తీసుకుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పడిందని, రాష్ట్రపతి ఉత్తర్వులపై అసెంబ్లీలో చట్టం చేయరాదని ఆయన పేర్కొన్నారు.
నారీమన్‌ అభిప్రాయం తరువాత రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రాజధాని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు శ్యాం దివాస్‌, నీరజ్‌ కిషన్‌పాల్‌ వాదనలు వినిపించారు.