చర్చలు విఫలమైతే  చైనాతో సైనిక చర్యలకు సిద్ధం

సరిహద్దు వివాదంపై చైనాతో జరుగుతున్న చర్చలు విఫలమైతే డ్రాగన్ దురాక్రమణలను తిప్పికొట్టడానికి సైనిక చర్యలకు దిగుతామని చీఫ్​ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య ఈ విషయంపై సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుగుతున్నాయని చెబుతూ లడఖ్‌లో చైనా ఆర్మీ అతిక్రమణను ఎదుర్కోవడానికి సైనిక చర్యలకు దిగే అవకాశం ఉందని సంకేతం ఇచ్చారు. 

వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నామని, అవి సఫలం కాకపోతే మిలటరీ యాక్షన్‌కు భారత సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చైనా ఆర్మీని ఎదుర్కొవడానికి మిలటరీ యాక్షన్‌ ప్రతిపాదన తమ వద్ద సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. అయితే మిలటరీ యాక్షన్‌కు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు.

సైనిక, దౌత్య స్థాయి చర్చలు విఫలమైతేనే దీన్ని ఆప్షన్‌గా భావిస్తామని రావత్ చెప్పారు. గత రెండు–మూడు నెలలుగా ఇరు వైపుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో ఐదుగురు లెఫ్టినెంట్‌ జనరల్ లెవల్ చర్చలు కూడా ఉండటం గమనార్హం. కానీ ఇవన్నీ విఫలమయ్యాయి. ఫింగర్ ఏరియా నుంచి తన ఆర్మీని వెనక్కి తీసుకోవడానికి చైనా నిరాకరిస్తోందని తెలుస్తున్నది. 

‘ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపు పైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అతిక్రమణలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం శాంతియుతంగానే పరిష్కారం కోరుతోంది. ఎల్‌ఏసీ వెంట యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి ఈ ప్రయత్నాలు సఫలం కాకపోతే మాత్రం సైనిక చర్యలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని రావత్వెల్లడించారు..

సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని రావత్ తెలిపారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌-మే నుంచి భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదం​కొనసాగుతుంది. ఇక జూన్‌ 15న చైనా- భారత్‌ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులను డ్రాగాన్‌ దేశం పొట్టనపెట్టుకుంది. దీనిని భారత్‌ తీవ్రంగా పరిగణించింది. 

ఏప్రిత్–మే నుంచి ఫింగర్ ఏరియా, గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్‌, కొంగ్రుంగ్ నాలా లాంటి ప్రాంతాల్లో చైనా ఆర్మీ అతిక్రమణకు దిగుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇది తీవ్రరూపం దాల్చింది. సైనిక పరమైన చర్చల ద్వారా ఇరు దేశాలు తమ సైన్యాలను వెనక్కి పంపాయి. కానీ వాస్తవాధీన రేఖ వెంబడి సుమారు లక్ష సైన్యాన్ని చైనా మోహరించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా సరిహద్దు వద్ద భద్రతా దళాలను మోహరించింది.