
దేశంలో ఈనెల 11 నుంచి 14 వరకు రుతుపవనాలు అధిక ప్రభావాన్ని చూపాయి. దీంతో వాయువ్య, మధ్య భారతదేశంలో భారీ వర్షపాతం నమోదైంది. ఇది జూలై చివరలో నమోదైన వర్షపాతం కొరతను అధిగమించింది.
దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే అది 103 శాతం ఎక్కువగా నమోదయ్యింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 19 న బెంగాల్ తీరంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని, ఇది భారీ వర్షాలకు దారితీయనున్నదనే అంచనాలున్నాయి.
కాగా జూలైలో బీహార్, అసోం, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముంబై, కొంకణ్, కర్ణాటకలలో ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు కురియగా, ఆగస్టు 15 న రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.
కేరళలోని ఇడుక్కిలో ఈ నెలలో కురిసిన వర్షాలు జనజీవనానికి తీవ్ర విఘాతం కలిగించాయి. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 55 మంది మృతి చెందారు.
కేంద్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోని 11 రాష్ట్రాల్లో సంభవించిన వరదల్లో మొత్తం 868 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇదే సమయంలో వరదల కారణంగా 908 మంది మృతిచెందారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్