చైనాతో తగ్గిన వాణిజ్య లోటు

చైనాతో భారత్‌ వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 48.66 బిలియన్‌ డాలర్లకు (రూ.3,63,891 కోట్లకు) తగ్గింది. చైనా నుంచి దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణమని ప్రభుత్వ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
2019-20లో భారత్‌ నుంచి చైనాకు 16.6 బిలియన్‌ డాలర్ల (రూ.1,24,155 కోట్ల) ఎగుమతులు జరిగాయని, అక్కడి నుంచి వచ్చిన దిగుమతుల విలువ 65.26 బిలియన్‌ డాలర్లు (రూ.4,88,046 కోట్లు)గా ఉన్నదని ఈ గణాంకాలు వెల్లడించాయి. 
 
2017-18లో ఇరు దేశాల మధ్య 63 బిలియన్‌ డాలర్లు (రూ.4,71,255 కోట్లు)గా ఉన్న వాణిజ్య లోటు.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 53.56 బిలియన్‌ డాలర్లకు (రూ.4,00,642 కోట్లకు) తగ్గింది. మరోవైపు చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,225 కోట్లకు తగ్గాయి.  
 
మరోవంక, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌తోపాటు మరో 58 యాప్‌లను నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నది. 
 
టిక్‌టాక్‌ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌ ఏకంగా రూ.45 వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) మేర నష్టపోనున్నట్లు చైనాకు ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ స్పష్టంచేసింది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, భద్రతను దృష్టిలో ఉంచుకొని నరేంద్రమోదీ సర్కార్‌ ఇటీవల టిక్‌టాక్‌, హెల్లోతోపాటు అనేక చైనా యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.