పహల్గాం ఉగ్రవాదులకు పీవోకేలో అంత్యక్రియలు

పహల్గాం ఉగ్రవాదులకు  పీవోకేలో అంత్యక్రియలు

పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉందనే విషయం మరోసారి బహిర్గతమైంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తాహిర్‌ హబీబ్‌ అలియాస్‌ అఫ్గానీకి పీవోకేలో “జనాజా ఏ గైబ్‌” విధానంలో అంత్యక్రియలు నిర్వహించడంతో ఇది తేటతెల్లం అయ్యింది.

గతేడాది దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న ఫోన్‌ పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను పట్టించింది. ఆ ఫోన్‌లోని ఫోటోల ఆధారంగానే ఉగ్రవాదులను భద్రతాదళాలు గుర్తించాయి. అటు ఈ ముగ్గురు ముష్కరులు పాకిస్థాన్‌కు చెందినవారేననే కీలక ఆధారాలు బయటపడ్డాయి. వారిలో ఒకడే ఈ తాహిర్‌ హబీబ్‌ అలియాస్‌ అఫ్గానీ.

పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులను ఫోటోల ఆధారంగా గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతేడాది దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన ఒక ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌లో లష్కరే తయ్యిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదుల ఫోటోలు ఉన్నాయి. అందులో పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడిన సులేమాన్‌ అలియాస్‌ ఫైజల్‌ జట్‌ సహా హమ్జా అఫ్గానీ, జిబ్రాన్‌లు ఆయుధాలతో దిగిన ఫోటోలను అధికారులు గుర్తించారు.

పహల్గాంలో ఉగ్రదాడి జరిపిన ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యక్ష సాక్షులకు ఆ ఫోటోలను చూపించి ముష్కరులు వారే అని నిర్ధారించుకున్నారు.  వెంటనే ఉగ్రవాదులను మట్టు బెట్టేందుకు భద్రతాదళాలు భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. దాదాపు దాచిగామ్‌ అటవీప్రాంతం మొత్తాన్ని జల్లడపట్టారు. ఉగ్రవాదులు లాంగ్‌రేంజ్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను వినియోగిస్తున్నారని తెలుసుకున్న అధికారులు ఆ సిగ్నల్‌ వ్యవస్థ ద్వారా ముష్కరులు నక్కిన ప్రాంతాన్ని గుర్తించారు. 

దాచిగామ్‌ అడవిలోనే ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘావర్గాల ద్వారా కూడా నిర్ధారించుకున్నారు. ఇందుకోసం ఇంటిలిజెన్స్‌ బ్యూరో అహర్నిషలు శ్రమించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదుల నక్కిన ప్రదేశానికి భద్రతాదళాలు వెళ్లగా పలుమార్లు ముష్కరులు తప్పించుకున్నారు. ఆపరేషన్‌ మహదేవ్‌తో పక్క ప్రణాళికలతో జులై 28న ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

పహల్గాంలో ఉగ్రదాడి తెగబడిన ముగ్గురు ముష్కరులు పాకిస్థాన్‌కు చెందినవారేనని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి తిరుగులేని ఆధారాలు బయట పడ్డాయి. ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తాహిర్‌ హబీబ్‌ అలియాస్‌ అఫ్గానీకి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌-పీవోకేలో “జనాజా ఏ గైబ్‌” విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

చనిపోయిన వ్యక్తి మృతదేహం అందుబాటులో లేకపోతే ఈ విధానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రావల్‌ కోట్‌ ఖైగలాలో పెద్దలు పాల్గొన్నట్లు ఉన్న వీడియోలను ఓ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్టు చేశారు. ఆ సమయంలో స్థానిక లష్కరే కమాండర్‌ రిజ్వాన్‌ హనీఫ్‌, ఇతరసభ్యులు కూడా దానిలో భాగం కావాలని ప్రయత్నించారు.  కానీ, తాహిర్‌ కుటుంబం వారిని అంత్యక్రియలకు హాజరుకాకుండా అడ్డుకొన్నారు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది.

స్థానికులను ఉగ్రవాదులు తమ ఆయుధాలతో భయపెట్టారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. మూడేళ్ల క్రితం పాక్‌ నుంచి 20 నుంచి 25మంది ఉగ్రవాదులు భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డారని నిఘావర్గాలు వెల్లడించాయి.  2024లో వారు 2 గ్రూప్‌లు విడిపోయారని, అందులో ఒక గ్రూప్‌నకు పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ సులేమాన్‌ నాయకత్వం వహించినట్లు వివరించాయి. మరో గ్రూప్‌నకు ముసా అనే ముష్కరుడు నాయకత్వం వహించాడని తెలిపాయి. ఈ రెండు ఉగ్రవాద గ్రూప్‌లు చాలా సార్లు భద్రతాదళాలపై కాల్పులు జరిపినట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి.