అత్యాచార కేసులో దోషిగా తేలిన ప్రజ్వల్‌ రేవణ్ణ

అత్యాచార కేసులో దోషిగా తేలిన ప్రజ్వల్‌ రేవణ్ణ

అత్యాచారం కేసులో జేడీఎస్‌ అధినేత దేవెగౌడ మనవడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా తేల్చింది. పనిమనిషిపై లైంగిక దాడి చేసిన కేసులో రేవణ్ణను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీనిపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంతోష్‌ గజానన్‌ భట్‌ శనివారం శిక్షను ఖరారు చేయనున్నారు. 

అయితే, ఈ తీర్పు వినగానే ప్రజ్వల్‌ కోర్టు గదిలోనే కంటతడి పెట్టుకున్నాడు. 2021లో ఆయన హ‌స‌న్‌లోని గ‌న్నికాడ ఫామ్‌హౌజ్‌లో ప్రజ్వల్‌ తనపై రెండు సార్లు అత్యాచారం చేసినట్లు 48 ఏళ్ల బాధితురాలు పోలీసులు ఆశ్రయించారు. ఆ ఘటనను ప్రజ్వల్‌ తన మొబైల్‌లో వీడియో తీసినట్లు ఆమె ఆరోపించింది. ప్రజ్వల్‌ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె ఆరోపించింది.

తాము ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయింది. తన నివాసంలో పనిచేసే మహిళలను ప్రజ్వల్‌ వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ప్రజ్వల్‌ బాధితుల్లో ఎంతో మంది మహిళలు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.  దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేసి 2వేల పేజీల ఛార్జిషీట్​తో పాటు విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. ఈ కేసులో 14 నెలలుగా జ్యూడీషియల్‌ కస్డడీలో ఉన్న ప్రజ్వల్‌ను తాజాగా న్యాయస్థానం దోషిగా తేల్చింది.

అంతకుముందు 2024 లోక్​సభ ఎన్నికల సమయంలో జేడీఎస్‌ పార్టీ అప్పటి ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ కేసులో ఎంపీ ప్రజ్వల్​తో పాటు ఆయన తండ్రి రేవణ్ణపై కూడా లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. 

ఈ క్రమంలోనే ప్రజ్వల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఓ మహిళ హోళెనరసిపుర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, అనంతరం కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈలోగా ప్రజ్వల్​ రేవణ్ణ దేశం వదిలి జర్మనీకి పారిపోయారు. తరువాత జరిగిన పరిణామాలతో చివరికి ఆయన బెంగళూరుకు రాగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.