ఆరు పాక్‌ డ్రోన్‌లను కూల్చేసిన భారత్‌

ఆరు పాక్‌ డ్రోన్‌లను కూల్చేసిన భారత్‌

సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పంజాబ్‌ లోని అమృత్‌సర్ సమీపంలో భారత్- పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలు, మత్తు పదార్థాలను మన దేశంలోకి పంపించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పంపించిన ఆరు డ్రోన్లను బీఎస్ఎఫ్ కూల్చివేసింది. వాటి నుంచి మూడు తుపాకులు, మ్యాగజీన్లతోపాటు ఒక కిలో హెరాయిన్‌ను బీఎస్‌ఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి అనుమానాస్పద వస్తువులు భారత్ భూభాగంలోకి వస్తున్నట్లు గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది. అవి పాక్‌కు చెందిన డ్రోన్లుగా గుర్తించి వెంటనే ప్రతిస్పందించి వాటిని కూల్చివేసింది.

మోథే సమీపంలో ఐదు డ్రోన్లను కూల్చిన బీఎస్ఎఫ్, మూడు తుపాకులు, మూడు మ్యాగజీన్‌లు, దాదాపు 1.07 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. గురువారం తెల్లవారుజామున అట్టారీ దాల్ గ్రామానికి సమీపంలో మరొక డ్రోన్‌ను కూల్చివేశారు. వీటితో పాటు దాల్ సమీపంలోని పంట పొలాల్లో తుపాకీ విడిభాగాలు, ఒక మ్యాగజీన్‌ను గుర్తించారు.