హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం

హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌ భవన్‌ లో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు జస్టిస్‌ ఏకే సింగ్‌ తో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ సుఖేందర్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు తదితరులు హాజరయ్యారు. 
 
కాగా తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత జస్టిస్‌ ఏకే సింగ్‌ ఏడవ చీఫ్‌ జస్టిస్‌ గా నియమితులయ్యారు. త్రిపుర హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన బదిలీపై తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ సుజయ్ పాల్‌ కోల్‌ కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు.  న్యాయకోవిదుల కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్‌ ఏకే సింగ్‌ 1965 జూలై 7న డాక్టర్‌ రాంగోపాల్‌సింగ్‌, డాక్టర్‌ శ్రద్ధ సింగ్‌ దంపతులకు జన్మించారు. 
ఆయన తల్లివైపు కుటుంబానికి చెందిన తాత జస్టిస్‌ బీపీ సిన్హా సుప్రీంకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తిగా, మరో తాత జస్టిస్‌ శంభుప్రసాద్‌ సింగ్‌ పట్నా హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టి్స్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.   జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ 1965 జులై 7న జన్మించారు. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ బీ పట్టా పొందారు.  1990 నుంచి 2000 వరకు ఉత్తర ప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. 2001 లో జార్ఖండ్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2012 జనవరి 24న జార్ఖండ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
 
2021 ఏప్రిల్‌ నుంచి జార్ఖండ్‌ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ గా 2022 నుంచి 2023 వరకు జార్ఖండ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.  2023 ఏప్రిల్‌ 17న త్రిపుర హైకోర్టు సీజేగా పదోన్నది పొందగా తాజాగా ఆయనను తెలంగాణ హైకోర్టుకు సీజేగా నియమిస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కాగా, హైకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 42 కాగా ప్రస్తుతం 26 మంది పనిచేస్తున్నారు. ఇద్దరు జడ్జీల బదిలీ, ఒకరి చేరికతో ఆ సంఖ్య 25కు తగ్గింది.