హిజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

హిజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

* ఖమేనీని చంపాలనుకున్నది నిజమే

ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు గాజా, లెబనాన్‌లపై విరుచుకుపడుతోంది. ఇరాన్ ప్రేరేపిత మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాకు ఆయువు పట్టుగా ఉన్న దక్షిణ లెబనాన్‌పై భీకర దాడులు చేస్తోంది. శుక్రవారం ఉదయం మౌంట్ షుకీఫ్ ప్రాంతంలోని నబాతియే నగరం సమీపంలో ఉన్న అల్ ఫౌకా, ఇక్లిమ్ అల్ తుఫా పర్వతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బంకర్ బస్టర్ బాంబులతో దాడికి పాల్పడ్డాయి. ఈ పర్వతాల కింద ఉన్న హిజ్బుల్లా రహస్య స్థావరం గతంలో ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతింది.

అయితే దాన్ని తిరిగి నిర్మిస్తున్నారనే సమాచారం అందడం వల్లే దాడి చేశామని ఇజ్రాయెలీ ఆర్మీ ప్రకటించింది. హిజ్బుల్లా ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకొని తీరుతామని తేల్చి చెప్పింది. ఆ పర్వతాలపై జరిపిన దాడుల్లో నలుగురికి స్వల్పగాయాలైనట్లు తెలిసింది. ఆ వెంటనే నబాతియే‌ నగరంలోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌పైనా ఇజ్రాయెల్ వాయుసేన దాడి చేసింది. దీంతో ఆ భవనంలోని పైఅంతస్తులో నివసిస్తున్న ఓ మహిళ చనిపోగా, 11 మందికి గాయాలయ్యాయి.

దక్షిణ లెబనాన్‌లోని జ్రారియెహ్‌, అన్సర్‌ గ్రామాల మధ్య ఉన్న ప్రాంతంపై కూడా ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల కారణంగా భారీ పేలుళ్లు జరిగిన దృశ్యాలు కూడా సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇజ్రాయెల్‌, హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ తమ దేశంలోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరిపిందని లెబనాన్‌ ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది.

కాగా, ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ జరిగి యుద్ధం ముగిసిన వేళ ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ యుద్ధం సమయంలో తాము ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీని అంతం చేయడానికి ప్రణాళిక రచించిన మాట నిజమేనని తెలిపారు.అయితే ఆ సమయంలో ఆయన రహస్య ప్రదేశంలో దాక్కోవడంతో దానిని విరమించుకున్నామని కట్జ్‌ తెలిపారు. అటువంటి చర్య వల్ల అంతర్జాతీయంగా కలిగే పరిణామాల ప్రమాదం గురించి ప్రశ్నించగా, దానికి తమకు అమెరికా అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్‌ వార్తా సంస్థలతో ఆయన మాట్లాడుతూ తాము ఖమేనీ జాడ కోసం తీవ్రంగా ప్రయత్నించామని, కానీ నిర్దేశిత సమయంలోగా ఆయన ఎక్కడున్నదీ కనిపెట్టలేక పోయామని చెప్పారు. ఆయన చాలా లోతైన రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారని, తన కమాండర్లతో కూడా మాట్లాడలేదని, కమ్యూనికేషన్‌ వ్యవస్థను పూర్తిగా బంద్‌ చేశారని చెప్పారు. ఆయనే కనుక తమ దృష్టిలో పడితే హతమార్చి ఉండేవారమని స్పష్టం చేశారు. ఇరాన్‌లో అధికార మార్పిడి తమ లక్ష్యం కాదని, అయితే అక్కడి నాయకత్వాన్ని అస్థిరపర్చాలనుకున్నామని ఆయన తెలిపారు.