ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌

ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌

* ఫోర్డో భూగ‌ర్భ అణు కేంద్రంపై మ‌ళ్లీ దాడి

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్‌లో ఉన్న వైమానిక క్షేత్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ దళాలు విరచుకుపడుతున్నాయి. ప‌శ్చిమ‌, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు ఆరు విమానాశ్రయాల‌పై ఇజ్రాయెల్ మిలిట‌రీ దాడి చేసిన‌ట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ దాడి తర్వాత ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది.  రాజధాని జెరూసలేం సహా పలు ప్రధాన నగరాలపై బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. 
దాదాపు 15 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో జెరూసలేంలో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపించినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ నివేదించింది. ఉత్తర ఇజ్రాయెల్‌ అంతటా సైరన్లు మోగినట్లు పేర్కొంది. ఈ దాడులను ఇజ్రాయెల్‌ సైన్యం సైతం ధృవీకరించింది. అంతకు ముందు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడ్డాయి. ప‌శ్చిమ‌, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు ఆరు విమానాశ్రయాల‌పై ఇజ్రాయెల్ మిలిట‌రీ అటాక్ చేసింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌ ఎక్స్ ద్వారా ప్రకటించింది.
రిమోట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌తో జ‌రిగిన దాడిలో సుమారు 15 ఇరాన్ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసం అయిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది.  దాడుల వ‌ల్ల విమానాశ్రయ ర‌న్‌వేలు, అండ‌ర్‌గ్రౌండ్ బంక‌ర్లు, రీఫుయ‌లింగ్ విమానం, ఎఫ్‌-14, ఎఫ్‌-5, ఏహెచ్‌-1 విమానాలు ధ్వంసమైన‌ట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. టార్గెట్ చేసిన విమానాశ్రయాల్లో మెహ్రబాద్‌, మాష‌ద్‌, డెజ్‌ఫుల్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాల్లో టేకాఫ్ జ‌ర‌గ‌కుండా ఉండే రీతిలో ఇజ్రాయెల్ మిలిట‌రీ అటాక్ కొన‌సాగించింది. ఇరాన్ ఆర్మీ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు చెప్పింది.

కాగా, ఇరాన్‌లోని ప‌ర్వ‌త ప్రాంతాల్లో ఉన్న ఫోర్డో భూగ‌ర్భ అణు కేంద్రంపై సోమవారం మ‌రోసారి దాడి జ‌రిగిన‌ట్లు ఇరాన్ మీడియా పేర్కొన్న‌ది.  యురేనియం శుద్దికి చెందిన ఫోర్డో అణు కేంద్రంలో భారీ న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని అంత‌ర్జాతీయ అటామిక్ ఎన‌ర్జీ ఏజెన్సీ పేర్కొన్న‌ది. భూగ‌ర్భ అణు కేంద్రంపై రెండు రోజుల క్రితం అమెరికా బీ2 బాంబ‌ర్లతో దాడి చేసిన విష‌యం తెలిసిందే. బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబ‌ర్ల‌తో ఆ అణు కేంద్రాన్ని ధ్వంసం చేశారు. 

ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ ఆర్మీ ప్రతినిధి తీవ్రంగా ఖండిస్తూ తమపై జరిపిన దురాక్రమణకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు. “గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసింది. దాని ఫలితం అనుభవించక తప్పదు. అమెరికాపై మరింత శక్తిమంతమైన చర్యలకు పాల్పడతాం. మా దేశంపై చేసిన దాడికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు” అని స్పష్టం చేశారు.

తమ అణుస్థావరాలపై దాడులు చేసినందుకు అమెరికా, ఇజ్రాయెల్‌లకు తగిన గుణపాఠం చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అమెరికాకు గట్టి సమాధానం ఇస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు.  ఇలా ఉండగా, అమెరికా కన్నుగప్పి 400 కేజీల శుద్ధిచేసిన యురేనియంను ఇరాన్​ దాచేసింది. తమ ప్రధాన అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేయడానికి ముందే ఇరాన్​ యురేనియం తరలింపు పని పూర్తి చేసింది.

ఇరాన్​ తన భవిష్యత్ అవసరాల కోసం మోతాదుకు మించి యురేనియంను శుద్ధి చేసింది. ఇదే ఇజ్రాయెల్‌, అమెరికాలకు కంటగింపుగా మారింది. ఇదే మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఘర్షణలకు దారి తీసింది. అయితే అమెరికా పకడ్బందీగా ఇంత భారీస్థాయిలో దాడి చేసినా, ఆ శుద్ధి చేసిన యురేనియం జాడను కనిపెట్టలేకపోయింది.