శర్మిష్ట అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం

శర్మిష్ట అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం
 
* ప్రధాని మోదీ జోక్యం కోరిన డచ్‌ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ 

22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఐ స్టాండ్ విత్ శర్మిష్ట’, ‘ఈక్వల్ జస్టిస్’ అనే హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన ఆమె పూనే లా యూనివర్శిటీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తోంది. ఈమెను బెంగాల్ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు.

ఆమె ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇస్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు పెద్దగా స్పందించడంలేదని నిలదీసింది. ఆమెకు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లున్నారు అయితే, తీవ్ర పదజాలంతో కూడిన ఆమె వ్యాఖ్యలు కొందరిని బాధిస్తున్నాయనే ఉద్దేశ్యంతో ఆమె తన పోస్ట్ ను డిలీట్ చేసింది. ఆమె తన తప్పును అంగీకరించి, వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పింది.

అయితే, ఆమెను మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అరెస్టు చేసింది. శర్మిష్ట చేసిన పోస్ట్‌పై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను కలకత్తా పోలీసులు గుర్గావ్‌లో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అరెస్ట్‌పై దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ చర్యలపై తీవ్ర నిరసనలూ వ్యక్తమవుతున్నాయి. 

 
విద్యార్థిని అరెస్ట్‌ను డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ తీవ్రంగా ఖండించారు. ఏంటీ దారుణాలు అంటూ ఆయన ప్రధాని నరేంద్రమోదీని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ ఆధారంగా పోలీసులు శర్మిష్ఠను అరెస్ట్‌ చేయడం సరైన చర్య కాదని వైల్డర్స్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. కోల్‌కతా పోలీసుల చర్య దేశంలోని వాక్‌ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని విమర్శించారు. 
 
శర్మిష్ఠను శిక్షించవద్దని కోరారు. ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ఠను విడుదల చేయాలని, ఆ మేరకు అధికారులను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి శర్మిష్ఠపైనే ఉందంటూ ఆమె ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ  తాను శర్మిష్టకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్ అయిన ఆపరేషన్ సిందూర్ దేశంలో ఉన్న పరిస్థితుల్ని, సున్నిత వాతావరణాన్ని సూచించింది. దీనిపై బాలీవుడ్ మౌనంపై శర్మిష్ట చేసిన కామెంట్లు అరెస్టుకు దారితీశాయని తెలిపారు.

సదరు పోస్ట్ గురించి క్షమాపణలు చెప్పి, పెట్టిన పోస్ట్‌ను శర్మిష్ట తొలగించినప్పటికీ ఆమెపై బెంగాల్ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారని మండిపడ్డారు. కానీ ఎన్నికైన నాయకులు, టిఎంసి ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన లోతైన, తీవ్రమైన బాధ గురించి ఏమిటి? మన విశ్వాసాన్ని ‘గాంధ ధర్మం’ అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడ ఉంది? వారి క్షమాపణ ఎక్కడ? వారి త్వరిత అరెస్ట్ ఎక్కడ? అని పవన్ మమతపై  ప్రశ్నల వర్షం కురింపించారు.

దైవదూషణను ఎల్లప్పుడూ ఖండించాలన్న పవన్ లౌకికవాదం కొందరికి కవచం కాదు, మరికొందరికి కత్తి కాదు. ఇది రెండు వైపులా ఉండే చౌరస్తా అయి ఉండాలని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసులూ.. దేశం చూస్తోంది. అందరికీ సమన్యాయంగా వ్యవహరించండి. అంటూ పవన్ తన పోస్ట్ లో హెచ్చరిక చేశారు.