సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు
 
ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గురువారం నియమితులయ్యారు. వీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యాబలం ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని పూర్తి స్థాయి 34కి పెరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం ముగ్గురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గత సోమవారం సిఫార్సు చేసింది.

వారిలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ అంజరియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ చందూర్కర్‌ ఉన్నారు. న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ గురువారం ఈ ముగ్గురు న్యాయమూర్తుల నియామకాన్ని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.  సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ పదవీ విరమణ దరిమిలా మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు ఖాళీలకు ఈ ముగ్గురి పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.

జస్టిస్‌ అంజరియా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2024 ఫిబ్రవరి 25న ప్రమాణం చేశారు. 2011 నవంబర్‌ 21న గుజరాత్‌ హైకోర్టు అదనపు జడ్జీగా పదోన్నతి పొందిన ఆయన 2013 సెప్టెంబర్‌ 6న శాశ్వత జడ్జీగా నియమితులయ్యారు. జస్టిస్‌ బిష్ణోయ్‌ 2024 ఫిబ్రవరి 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. 2013 జనవరి 8న రాజస్థాన్‌ హైకోర్టులో అదనపు జడ్జీగా నియమితులైన జస్టిస్‌ బిష్ణోయ్‌ 2015 జనవరి 7న అదే హైకోర్టులో పర్మనెంట్‌ జడ్జీగా ప్రమాణం చేశారు.

జస్టిస్‌ చందూర్కర్‌ 1988 జూ లై 21న న్యాయవాదిగా బార్‌లో చేరారు. 1992లో నాగ్‌పూర్‌కు మకాం మార్చిన జస్టిస్‌ చందూర్కర్‌ వివిధ కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. 2013 జూన్‌ 21న బాం బే హైకోర్టు అదనపు జడ్జీగా పదోన్నతి పొంది తర్వాత పర్మనెంట్‌ జడ్జీగా నియమితులయ్యారు.