
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 104కు చేరింది. అక్కడ గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 99 మంది కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కేరళలో కేసుల సంఖ్య 400 దాటింది. సోమవారం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009 ఉంది.
గత 24 గంటల్లో కేరళలో 335 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. గడిచిన వారం రోజుల్లోనే దేశంలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసులపరంగా కేరళ మొదటి స్థానంలో ఉండగా తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లలో వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
మహారాష్ట్రలో 153 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, సోమవారం నాటికి 209కు యాక్టివ్ కరోనా కేసులు చేరుకున్నాయి. అలాగే, గుజరాత్ 83, కర్ణాటక 47, ఉత్తరప్రదేశ్ 15, బంగాల్ 12 నమోదయ్యాయి. అంతకుముందు థానెలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ కల్వా ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీహార్లో తొలి కేసు నమోదైంది. అయితే కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ వాటి తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల పేర్కొంది. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ రేటు తక్కువగా ఉందని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటోందని చెప్పింది. వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఈ మధ్య ఆసియా దేశాలు మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్లాండ్తోపాటు చైనాలోనూ కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు.
జేఎన్.1 ఉపరకాలైన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు తెలిపారు. అవే ఉపరకాలను భారత్లో గుర్తించినట్లు ఇటీవల ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సకాగ్) గత వారం వెల్లడించింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్