విదేశీ విద్యా నిధి పథకంలో అవకతవకలు

విదేశీ విద్యా నిధి పథకంలో అవకతవకలు
విదేశీ విద్యా నిధి పథకంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సుమారుగా 20 మంది విద్యార్థులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ పథకం కింద అనర్హులను ఎంపిక చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.  ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించడానికి సుమారుగా రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇలా ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులు తప్పుడు పత్రాలను సమర్పించినట్లుగా ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ మేరకు ఈ పథకం కింద ఎంపికై విదేశాలకు వెళ్లిన విద్యార్థుల ఆర్థిక స్థితిగతులపై బిసి సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పలువురు విద్యార్థులకు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. ఈ పథకం కింద ఎంపికైన వారిలో ఇన్‌కంట్యాక్స్ కట్టే వారు కూడా ఉన్నారని అధికారుల విచారణలో తేలింది.

గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది ఇన్‌కంట్యాక్స్ కట్టే వారు కూడా ఉన్నారని, వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకం కింద అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారని వారిని కూడా ఎంపిక చేశారని పలువురు ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.  దీంతో ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులు ఇన్‌కం సర్టిఫికెట్‌లను, తల్లిదండ్రుల ఆదాయంకు సంబంధించిన ఆధారాలను మరోసారి సమర్పించాలని బిసి సంక్షేమ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.

ఒకవేళ ఆ విద్యార్థుల సర్టిఫికెట్లు తప్పు అని తేలితే వారి నుంచి విద్యా నిధి పథకం కింద మంజూరైన నిధులను రికవరీ చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.  ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను బిసి సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించినట్టుగా సమాచారం. అయితే ఈ విద్యార్థుల ఎంపికలో ఓ కార్యదర్శి స్థాయి అధికారి భారీగా ముడుపులు తీసుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని సైతం ప్రభుత్వానికి కొందరు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.