అణ్వాయుధ క్షిపణిగా సుప్రీంకోర్టుకు ప్రత్యేకాధికారులు

అణ్వాయుధ క్షిపణిగా సుప్రీంకోర్టుకు ప్రత్యేకాధికారులు
 
కోర్టులు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి మనకు ఉండదని స్పష్టం చేస్తూ  రాజ్యాంగంలోని 142వ అధిక‌ర‌ణ ద్వారా సుప్రీంకోర్టు ప్ర‌త్యేక అధికారాలు వ‌ర్తిస్తాయ‌ని, అయితే ఆ అధిక‌ర‌ణను ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌పై ఓ న్యూక్లియ‌ర్ మిస్సైల్ త‌ర‌హా వాడుతున్న‌ట్లు ఆరోపించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ భారత న్యాయ వ్యవస్థ లక్ష్యంగా తీవ్రమైన వాఖ్యలు చేశారు.
రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించడానికి గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఈ అంశంపై స్పందించారు. న్యాయవ్యవస్థను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడారు. కోర్టులు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి మనకు ఉండదని స్పష్టం చేశారు.
 
ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ ఎంక్లేవ్‌లో గురువారం జ‌రిగిన 6వ రాజ్య‌స‌భ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ఆయ‌న మాట్లాడుతూ భార‌త రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి చాలా అత్యున్న‌త‌మైంద‌ని, రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించేందుకు శ‌ప‌ధం చేసి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల ఓ తీర్పులో రాష్ట్ర‌ప‌తికి సూచ‌న చేశార‌ని, ఇంత‌కీ మ‌నం ఎక్క‌డికి వెళ్తున్నామ‌ని, దేశంలో ఏం జ‌రుగుతోంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
సున్నిత‌మైన అంశాల్లో మ‌నం చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఇలాంటి అంశాల‌పై కేసు ఫైల్ చేయాలా వ‌ద్దా అన్న అంశం స‌రికాద‌ని పేర్కొంటూ ఇలాంటి ప్ర‌జాస్వామ్యం కోసం మ‌నం వేడుకోలేద‌ని తేల్చి చెప్పారు. డెడ్‌లైన్ ప్ర‌కారం ప‌నిచేయాల‌ని రాష్ట్ర‌ప‌తిని ఆదేశించ‌డం స‌రికాద‌ని స్పష్టం చేశారు.  సుప్రీం వ్యాఖ్య‌లను ప‌రిశీలిస్తే జ‌డ్జీలే శాస‌న వ్య‌వహారాలు చూస్తున్న‌ట్లు ఉంద‌ని అంటూ ఎద్దేవా చేశారు. ఎగ్జిక్యూటి ఆదేశాలు అమ‌లు చేస్తున్న‌ట్లు ఉంద‌ని అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
సూప‌ర్ పార్ల‌మెంట్‌ను జ‌డ్జీలు న‌డిపిస్తున్న‌ట్లు ఉంద‌ని అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దేనికీ బాధ్య‌త లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఇది ఈ నేల విధానాల‌కు వ‌ర్తించ‌దని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్ర‌ప‌తిని ఆదేశించే ప‌రిస్థితి స‌రికాదు అని, అస‌లు ఏ ఆధారంగా అలా చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 145(3) ప్ర‌కారం మాత్ర‌మే రాజ్యాంగాన్ని ప్ర‌శ్నించే హ‌క్కు ఉంద‌ని గుర్తు చేశారు. దానికి కూడా అయిదుగురు లేదా అంత‌క‌న్నా ఎక్కువ మంది జ‌డ్జీల‌తో ధ‌ర్మాస‌నం ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.

ఇలా ఉండగా, ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి తప్పనిసరిగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తొలిసారిగా గడువును నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి కూడా జ్యుడీషియల్ రివ్యూకు కట్టుబడి ఉండాలని ఆ తీర్పులో స్పష్టం చేసింది.