క్షణాలో గుండె జబ్బుల నిర్ధారణ

క్షణాలో గుండె జబ్బుల నిర్ధారణ
 
* తెలుగు బాలుడి అద్భుత ఆవిష్కరణ
 
వైద్యరంగంలో తెలుగు బాలుడు సిద్ధార్థ్‌ నంద్యాల ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో నివాసముంటున్న 14 ఏండ్ల సిద్ధార్థ్‌ తన ఆవిష్కరణతో ఇటు సాంకేతిక రంగాన్ని అటు వైద్య రంగాన్ని అబ్బురపరిచాడు.  అతడు ఆవిష్కరించిన యాప్‌ కృత్రిమే మేధ (ఏఐ) సాయంతో మనిషి గుండె ఆరోగ్యాన్ని నిర్ధారిస్తున్నది. 
సర్కేడియన్‌ ఏఐగా పేరుపెట్టిన ఆ పరికరం ఏడు క్షణాలపాటు గుండెచప్పుడు విని, అది ఆరోగ్యంగా ఉన్నదా లేక వ్యాధి బారిన పడిందా అన్నది వెంటనే తేల్చేస్తున్నది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ఏఐ ప్రొఫెషనల్‌గా సిద్ధార్థ్‌ రికార్డు సృష్టించాడు. అతడు ఆవిష్కరించిన పరికరంతో ఇప్పటికే వేలమందిని పరీక్షించగా, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జో బైడెన్‌ల నుంచి ప్రశంసా పత్రాలను కూడా అందుకున్నాడు. 

హైదరాబాద్‌కు చెందిన ఈ టీనేజర్‌ చిన్న వయసులోనే అమెరికా వలస వెళ్లాడు. 2023వ సంవత్సరానికిగాను సిద్ధార్థ్‌ను ఇన్నోవేటర్‌ ఆఫ్‌ది ఇయర్‌గా ఫ్రిస్కో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎంపిక చేసింది. అదే ఏడాది అమెరికా ప్రజాప్రతినిధుల సభ అతడికి గుర్తింపు సర్టిఫికెట్‌ను జారీచేసింది. తన పరికరం పని విధానాన్ని సిద్ధార్థ్‌ వివరిస్తూ ‘సర్కేడియన్‌ ఏఐ అనేది ఒక ఆటోమేటెడ్‌ పరికరం. ఇది ఏడు క్షణాలపాటు గుండె చప్పుడు విని సమగ్ర నివేదికను అందిస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉన్నదా లేక ఏమైనా సమస్యలున్నాయా అన్నది వెల్లడిస్తుంది’ అని చెప్పాడు. 

‘మీ గుండె మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించండి. ఏఐ సహకారంతో పనిచేసే ఈ పరికరం మీ గుండె అంతర్దృష్టిని అందిస్తుంది’ అని తెలిపాడు.  ఈ యాప్‌ను గుండె వద్ద ఏడు క్షణాల పాటు ఉంచితే అది 40 రకాల గుండె సంబంధిత వ్యాధులను పసిగడుతుంది అని తెలిపాడు. 

అమెరికాలో 15 వేల మందిని భారత్‌లో 700 మందినిని, గుంటూరు,విజయవాడ ప్రభుత్వ దవాఖానల్లో 992 మందిని పరీక్షించగా 19 మంది హృద్రోగులు ఉన్నట్టు వెల్లడైంది. ఆ తర్వాత వీరికి టూ(2)డీ ఈకో, ఈసీజీ పరీక్షలు నిర్వహించగా సర్కేడియన్‌ పరికరం తేల్చింది నూటికి నూరు శాతం కరెక్ట్‌ అని తేలింది. వైద్యరంగానికి సహాయకరంగా ఉండేందుకే దీనిని అభివృద్ధి చేశానని, సొంతానికి కాదని స్పష్టం చేశాడు.

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను కలిసి తన వినూత్న వైద్య పరికరాన్ని చూపించాడు.

అనంతపూర్ కు చెందిన అతని తండ్రి మహేష్ 2010లో అమెరికాకు వలస వెళ్లారు. తల్లి శ్రీ లత ప్రోత్సాహంతో ఏడేళ్ల వయస్సులోనే స్టెమ్ సాంకేతికతను నేర్చుకొని ఎలక్ట్రానిక్ కిట్ ను తయారు చేసాడు.