దళిత ఎమ్మెల్యే కెళ్లాడని ఆలయ శుద్ధి చేసిన బీజేపీ నేత సస్పెండ్

దళిత ఎమ్మెల్యే కెళ్లాడని ఆలయ శుద్ధి చేసిన బీజేపీ నేత సస్పెండ్

రాజ‌స్థాన్‌ లో బీజేపీ నేత జ్ఞాన్‌దేవ్ అహుజాపై వేటు ప‌డింది. అత‌న్ని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. షోకాజ్ నోటీసు కూడా అత‌నికి జారీ చేసింది పార్టీ.  రాజస్థాన్ ప్రతిపక్ష పార్టీ నేత, ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసి, మూడోసారి కూడా శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న టికా రామ్ జుల్లీ ఇటీవలే ఓ రామాలయానికి వెళ్లారు. 

శ్రీరామనవమి పండుగ సందర్భంగా అల్వార్‌లోని శ్రీరామ చంద్ర ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించి మరీ వెళ్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేత జ్ఞాన్‌దేవ్ అహుజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే రాకతో ఆలయం అపవిత్రం అయిందని ఆరోపించారు. వెంటనే ఆలయాన్ని శుద్ధి చేయాలని చెబుతూ గంగాజలం తీసుకు వచ్చారు.

ఆ నీటిని దేవుళ్లపై చల్లి ఆ తర్వాత ఆలయ ప్రాంగణం అంతా జిలకరించారు. ఆపై ఆలయం శుద్ధి అయిందంటూ ప్రకటించారు. ఆ సమయంలోనే పలువురు దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టగా నెట్టింట వైరల్ అయింది. తాను చేసిన పని తీవ్ర వివాదాస్పదం కావడంతో బీజేపీ నేత జ్ఞాన్‌దేవ్ అహుజా స్పందించారు. 

తనకు టికా రామ్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషమూ లేదని చెప్పుకొచ్చారు. అలాగే తనకు దళితులపై కూడా కోపం లేదని, కాకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే మాత్రం నచ్చదని చెప్పారు. రామసేతు లేదని, అది కేవలం హిందువుల కల్పనే అని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, మరి అలాంటప్పుడు ఆ నేతలు ఆలయాలకు ఎందుకు రావాలని ప్రశ్నించారు. అలాంటి వాళ్లు రావడం నచ్చకే తాను ఆలయ శుద్ధి చేసినట్లు వివరించారు.

అయితే, దీన్ని బీజేపీ అధిష్టానం సైతం సమర్థించలేదు. ఆలయ శుద్ధి చేసిన బీజేపీ నేత జ్ఞాన్‌దేవ్ అహుజాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే బీజేపీ ఎంపీ, సీనియర్ నేత దామోదర్ అగర్వార్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. మూడు రోజుల్లోగా అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఒకవేళ వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సమయంలో చేసిన ప్రమాణాలను ఉల్లంఘించినట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.