భారత్ సహా 14 దేశాలకు సౌదీ వీసాలు నిషేధం

భారత్ సహా 14 దేశాలకు సౌదీ వీసాలు నిషేధం
సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో భారత్ సహా 14 దేశాలకు వీసాల జారీని నిషేధిస్తూ సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాలు నిషేధించిన దేశాల జాబితాలో భారత్ తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. 

ఈ నిషేధం కారణంగా ఆయా దేశాల పౌరులు తిరిగి ఆదేశాలు వచ్చే వరకూ వీసాల కోసం ఎదురు చూడాల్సిందే. సౌదీ అరేబియా ఇలా వీసాలు నిషేధించిన జాబితాలో భారత దేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేసియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సుడాన్, ఇథోఫియా, ట్యునీషియా, యెమెన్, మొరాకో ఉన్నాయి.

సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్టు సౌదీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉమ్రా వీసాలు కలిగి ఉన్న వ్యక్తులు మాత్రం ఏప్రిల్ 13 వరకు సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు వెసులుబాటు కల్పించారు.

గతేడాది చాలా మంది విదేశీయులు ఉమ్రా లేదా విజిట్ వీసాలపై సౌదీ అరేబియాలోకి ప్రవేశించి అధికారిక అనుమతి లేకుండా హజ్‌లో పాల్గొనడానికి చట్టవిరుద్ధంగా అక్కడే ఉండిపోయారు. దీంతో భారీగా రద్దీ తలెత్తి తీవ్రమైన వేడి వాతావరణం కూడా ఏర్పడి 1200 మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇలా వీసాల జారీ నిలిపివేసినట్లు తెలుస్తోంది.