అలహాబాద్‌ ట్రిపుల్ ఐటీలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

అలహాబాద్‌ ట్రిపుల్ ఐటీలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అలహాబాద్ ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరణించారు. వారిలో ఒకరు గుండెపోటుతో మృతి చెందగా, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు.  అలహాబాద్ ట్రిపుల్ ఐటీ ప్రాంగణ అధికారులు, పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన కాట్రావత్ రాజు నాయక్‌, దేవి దంపతుల కుమారుడు అఖిల్‌ (21) అలహాబాద్ ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

శనివారం రాత్రి 9 గంటల సమయంలో గదిలోకి వెళ్లిన అఖిల్ గుండెపోటుతో మృతి చెందాడు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు రాజు నాయక్‌, దేవి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు.

కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణ, స్వర్ణలత దంపతులు నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలో హోటల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు మాదాల రాహుల్‌ చైతన్య (21) జేఈఈలో జాతీయ స్థాయిలో 52వ ర్యాంకు సాధించి అలహాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో గతేడాది ఆగస్టులో చేరాడు. 

దివ్యాంగుడైన చైతన్య శనివారం రాత్రి గదిలోకి వెళ్లి నిద్రించాడు. అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి అనంతరం వసతి గృహం ఐదో అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో చైతన్య అక్కడికక్కడే మరణించాడు. ఇటీవల జరిగిన సెమిస్టర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు మనస్తాపం చెందిన రాహుల్‌ చైతన్య ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా అఖిల్, రాహుల్‌ చైతన్యలు ఇద్దరు ప్రాంగణంలో చేరినప్పటి నుంచి మంచి స్నేహితులు అని, అఖిల్‌ మరణాన్ని తట్టుకోలేకనే చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. చెవుడు, మూగతో బాధపడుతున్న రాహుల్‌కు అఖిల్‌ అండదండగా ఉండేవాడని స్నేహితులు వివరించారు.  ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు మరణించారంటూ మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వేర్వేరుగా ఆందోళన చేపట్టారు.

ఇద్దరు విద్యార్థుల మృతిపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటుచేశామని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఆత్మహత్యకు పాల్పడిన రాహుల్‌ పుట్టిన రోజు ఆదివారం జరగాల్సి ఉండగా అదే రోజు అతను ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబాన్ని విషాదంలో నింపింది.

ఈ ఘటనపై నిజ నిర్ధారణ కోసం ప్రొఫెసర్‌ యుఎస్‌ తివారీ, ప్రొఫెసర్‌ ఓపి వ్యాస్‌, ప్రొఫెసర్‌ పవన్‌ చక్రవర్తిలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు.. ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఇన్‌చార్జ్‌ ప్రొఫెసర్‌ జీసీ నంది వివరించారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని.. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కమిటీ సభ్యుల్లో 50 శాతం మంది విద్యార్థులు ఉంటారు.