తెలంగాణాలో 49 శాతం మేర పడిపోయిన ఇండ్ల అమ్మకాలు

తెలంగాణాలో 49 శాతం మేర పడిపోయిన ఇండ్ల అమ్మకాలు
కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు, అస్పష్టమైన ఆలోచనలు, వివాదస్పదమైన హైడ్రా లాంటి నిర్ణయాలు, పేదల నడ్డి విరిచేలా అమలు చేసిన ప్రకటనలతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుప్పకూలుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ వెల్లడించిన నివేదిక హైదరాబాద్‌ నగరంలో ఏకంగా 49 శాతం మేర ఇండ్ల అమ్మకాలు పడిపోయాయని, దేశంలోనే అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాదే అట్టడుగున ఉందని తేల్చింది.
 
రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం  ‘లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. విస్తృతంగా కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఊహకందని తీరుగా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఫ్యూచర్‌ సిటీ పేరిట కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు, విస్తృతమైన వ్యాపార అవకాశాలు’ అంటూ చేస్తున్న ప్రచారంకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతనలేకుండా పోతుంది.
2009-12 సమయంలోనూ ఇదే తీరుగా రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభంలో కూరుకుపోత తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌ కేంద్రంగా ఎకరం వంద కోట్లకు విక్రయించుకునే స్థాయికి తీసుకెళ్లింది. గడిచిన పదేండ్లలో హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన రియల్‌ ట్రెండ్‌తో విదేశీ సంస్థలు సైతం లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. 

అలా దేశంలో ఏ మెట్రో నగరంలో లేనట్లుగా అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ నగరంలో తమ కార్పొరేట్‌ కార్యాలయాలను ప్రారంభించుకునే వేదికను చేసుకున్నాయి.  నగరానికి మణిహారం లాంటి ఓఆర్‌ఆర్‌ దాటి రియల్‌ కార్యాకలాపాలు విస్తరించాయి. 

ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ జాతీయ స్థాయిలో ఘనమైన చరిత్రను సొంతం చేసుకున్నది. ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలానికి కూడా అనూహ్య స్పందన రావడంతో ఎకరం వంద కోట్లకు విక్రయించే స్థాయికి ఎదిగింది. అయితే, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఆయువుపట్టు లాంటి ఇంటి నిర్మాణ రంగం హైడ్రా దెబ్బకు కోలుకోలేని పరిస్థితిలో ఉంది.

దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మోస్తరు స్థాయిలో ఉందని ప్రముఖ నిర్మాణ రంగ అధ్యయన సంస్థ అనరాక్‌ వెల్లడించింది. హైదరాబాద్‌లో మాత్రం అమ్మకాలు 49శాతం పడిపోతాయని తేల్చింది. తొలి త్రైమాసికంలో జరిగిన అమ్మకాలపై నివేదికను రూపొందించగా గతేడాదిలో పోల్చితే 9వేల యూనిట్ల అమ్మకాలు తగ్గే అవకాశం కనిపిస్తుందని పేర్కొంది.

గతేడాది మొదటి త్రైమాసికంలో 19660 యూనిట్ల నుంచి 10వేల యూనిట్లకు పడిపోతుందని వెల్లడించింది. మిగిలిన మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే దారుణంగా అమ్మకాలు పడిపోతాయని అంచనా వేయడం కలవరపెడుతోంది. ప్రాప్‌ఈక్విటీ సంస్థ వెల్లడించిన నివేదికలోనూ 47శాతం మేర అమ్మకాలు పడిపోగా అన్ని మెట్రో నగరాల కంటే దారుణంగా హైదరాబాద్‌ మార్కెట్‌ ఉందని తేల్చింది. 

ఈ రియల్‌ సంక్షోభం కేవలం గృహా నిర్మాణాలకే పరిమితం కాకుండా, ఆఫీస్‌ స్పేస్‌ అమ్మకాలోనూ ఉందని మరో నివేదికలో పేర్కొంది. ఐటీ కారిడార్‌ కేంద్రంగా పుష్కలంగా అందుబాటులో ఆఫీస్‌ స్పేస్‌కు కూడా డిమాండ్‌ లేదని నివేదికలు వెల్లడించాయి.