రేప్​పై అలహాబాద్ జడ్జి వ్యాఖ్యలు అమానవీయం

రేప్​పై అలహాబాద్ జడ్జి వ్యాఖ్యలు అమానవీయం
మహిళల దుస్తులను పట్టుకుని లాగడం, ఛాతి భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదంటూ అలహాబాద్‌ హైకోర్టు జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తీర్పు సందర్భంగా అలహాబాద్‌ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని, అమానవీయంగా ఉన్నాయని పేర్కొంది. 

అలహాబాద్ జడ్జి వివాదాస్పాద తీర్పుపై జస్టిస్‌ బీఆర్ గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనం సుమోటోగా స్వీకరించి బుధవారం విచారణ చేపట్టింది. జడ్జి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన ధర్మాసనం, వాటిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రంతోపాటు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

2021 నవంబరులో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ బాలికను బైక్‌పై ఇంటి వద్ద దింపుతామని ఎక్కించుకుని ఇద్దరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడం వల్ల నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.  ఈ కేసుపై మార్చి 17న విచారణ జరిపింది అలహాబాద్‌ హైకోర్టు. ఆ సమయంలో జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా, మహిళ వక్షోజాలను తాకడం, దుస్తులు పట్టుకొని లాగినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదంటూ తీర్పు వెలువరించారు. ఆ తీర్పు కాస్త వివాదాస్పదంగా మారింది. 

న్యాయమూర్తి వ్యాఖ్యలు న్యాయస్థానాలపై గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తమైంది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి కూడా అలహాబాద్ కోర్టు తీర్పుపై స్పందించారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరిపి స్టే విధించింది.