
మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు న్యాయస్థానం స్వల్ప ఊరట కల్పించింది. ఈ కేసులో విచారణకు ఈ నెల 15న హాజరుకావాలని కోరుతూ దీని కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు యుడియూరప్పకు సమన్లు జారీ చేసింది.. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది. ఫాస్ట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే మంజూరు చేసింది.
మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న ఓ 17 ఏళ్ళ బాలికను లైంగికంగా వేధించారని యడియూరప్పపై ఆరోపణలు రాగా పోక్సో కేసు నమోదు చేశారు. ఓ మహిళ తన 17 ఏళ్ల కుమార్తెతో కలిసి బెంగళూరు నగరంలోని డాలర్స్ కాలనీలో ఉన్న యడియూరప్ప ఇంటికి వెళ్లగా, ఆయన తన కుమార్తెను లైంగికంగా వేధించారని గతేడాది మార్చి 14వ తేదీన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఒక మోసం కేసులో తనకు సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన యడియూరప్పను కలిశారు. ఆ సమయంలోనే తన కుమార్తెను యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యడియూరప్పపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను యడియూరప్ప ఆఫీస్ తీవ్రంగా ఖండించింది.
అంతేకాకుండా ఈ పోక్సో కేసు నమోదు చేసిన మహిళ గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలే చేశారని తెలిపింది. అయితే ఇటీవల తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. బాలికపై దాఖలైన లైంగిక వేధింపుల అంశంలో పోక్సో కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది.
ఈ క్రమంలోనే ఆ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసును వాపస్ తీసుకునేందుకు తనకు యడియూరప్ప డబ్బు ఆశ చూపించారని బాలిక తల్లి ఆరోపించింది. ఈ ఆరోపణలను యడియూరప్ప తరఫు లాయర్ కూడా తోసిపుచ్చారు.
గతంలో మరో వ్యక్తి అదే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆ కేసులో సహాయం కోసం వారిద్దరు యడియూరప్పను కలిసినట్లు ఆయన కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ వాదనలను ప్రాసిక్యూషన్ తిప్పికొట్టింది. బాలికను యడియూరప్ప లైంగికంగా వేధించారని చెప్పేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. బాలికపై లైంగిక వేధింపులు హేయమైన చర్య అని ప్రాసిక్యూషన్ చెప్పింది.
More Stories
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం