ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రదాడి ముప్పు?

ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రదాడి ముప్పు?

శ్రీలంక జట్టుపై 2009లో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ఇతర దేశాల క్రికెట్ జట్లన్ని వెనకడుగు వేశాయి. ఈ ఘటనతో పాకిస్తాన్‌ దశాబ్ద కాలంగా కీలకమైన అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వలేకపోయింది. తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు ఇబ్బందికరంగా మారింది.

అయితే ఆ తర్వాత పాకిస్తాన్ చేసిన చాలా ప్రయత్నల కారణంగా పలు జట్లు పాకిస్థాన్‌లో సిరీస్‌లు ఆడాయి.దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో తొలి ఐసిసి టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. భారత్ మినహా మిగితా జట్లు అన్ని పాకిస్థాన్‌లోనే ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. అయితే టోర్నమెంట్ ప్రారంభమై వారం రోజులు కూడా కాకముందే పాక్‌లో ఉగ్రవాద సంస్థలు తమ వక్రబుద్ధిని బయటపెట్టాయి. 

ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేస్తూ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో  సెక్యూరిటీ అడ్వైజరీ జారీ చేసింది. దీంతో పాకిస్థాన్ మొత్తం హైఅలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు వచ్చే అతిథులను తరీక్-ఏ-తాలిబన్, ఐసిస్‌తో పాటు బలుచిస్థాన్‌కు సంబంధించిన పలు ఉగ్రమూకలు కిడ్నాప్ చేసే ప్రమాదం ఉందని సమాచారం. 

దీంతో పాకిస్థాన్‌లోని ప్రధాన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తాజా భద్రతా సమస్యల నేపథ్యంలో పాకిస్తాన్‌ హై ఫ్రొఫైల్‌ టోర్నీలను నిర్వహించే సామర్థ్యంపై మరోసారి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌ భద్రతా కారణాలను చూపుతూ ఆ దేశంలో పర్యటించేందుకు నిరాకరించింది. చాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో దుబాయిలో మ్యాచులు ఆడుతున్నది.

ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి అతిథ్యమిస్తున్న పాకిస్థాన్ జట్టు టోర్నమెంట్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిపోవడంతో ఆ మ్యాచ్‌ను ఆరు వికెట్ల తేడాతో చేజార్చుకొని సెమీస్ ఆశల్ని కోల్పోయింది.

పాకిస్తాన్‌ టోర్నీలో నిలువాలంటే.. బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలి. అదే సమయంలో భారత్‌ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించాలి. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ కంటే ఎక్కువగా రన్‌ రేట్‌ ఉండేలా చూసుకోవాలి. సోమవారం బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ గెలిస పాకిస్తాన్ అధికారికంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే ఆ జట్టు ప్రదర్శనతో పాకిస్తాన్‌ అభిమానులు నిరాశకు గురవుతుండగా.. తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు వార్తలు ఆతిథ్య దేశానికి మరింత ఇబ్బందికరంగా మారాయి.