ప్రధానార్చకులు రంగరాజన్ కు విహెచ్‌పీ బృందం పరామర్శ

ప్రధానార్చకులు రంగరాజన్ కు విహెచ్‌పీ బృందం పరామర్శ

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. రాముడుని అడ్డం పెట్టుకొని ధర్మంపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.  బుధవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రతినిధి బృందం వెళ్లి చిలుకూరులో రంగరాజన్ ని పరామర్శించింది. 

దాదాపు అరగంట పాటు మాట్లాడి జరిగిన ఘటన గురించి అన్ని విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా రంగరాజన్ కు పరిషత్ అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించింది. ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా ధర్మరక్షణకు తాము కట్టుబడి ఉంటామని పరిషత్ నాయకులు స్పష్టం చేశారు. దాడి ఘటన తమను తీవ్రంగా కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ధర్మం ముసుగులో కొంతమంది హిందుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని యావత్  హిందూ సమాజం తీవ్రంగా పరిగణించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో రాడికల్ సిష్టానికి, చెట్ట వ్యతిరేక శక్తులకు తావు లేదని స్పష్టం చేశారు. ఎంతటి వ్యక్తులైన కూడా చట్టానికి లోబడే పని చేయాలని సూచించారు.  ధర్మం పేరు చెప్పి దౌర్జన్యాలకు పాల్పడటం, వ్యాపారాలు చేయడం ధర్మద్రోహం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రంగరాజన్ గారుమాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ తమకు అండగా నిలబడటం కొండంత బలాన్ని ఇచ్చిందని చెప్పారు. పరిషత్ అంటే తమ కుటుంబమని పేర్కొన్నారు. దాడి చేసిన దుండగులను దేవుడే చూసుకుంటాడని చెబుతూ దాడి ఘటనలో తనను చిత్ర హింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అయినప్పటికీ తాను సంయమనం పాటించి, ద్రోహులను, అరాచక శక్తులను చట్టానికి పట్టించాలని చెప్పారు.  తాను సంయమనం కోల్పోయి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని వివరించారు. ఏది ఏమైనా విశ్వహిందూ పరిషత్ ధర్మకర్యం మరింత పెరగాలని సూచించారు. ఈ సందర్భంగా రంగరాజన్ కు పూలమాలలు వేసి నాయకులు అభినందనలు తెలియజేశారు.  

కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్, డాక్టర్ సునీత రెడ్డిరు రాష్ట్ర నాయకులు చింతల వెంకట్ రెడ్డి, ప్రచార ప్రసార ప్రముఖ్  పగుడాకుల బాలస్వామి, మాతృ శక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి పద్మశ్రీ, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి వాణి సక్కుబాయి, డాక్టర్ ప్రేమలత, అనంతగిరి జిల్లా ఉపాధ్యక్షులు రంగనాథ్, నాయకులు నందకిషోర్, మధుసూదన్ రెడ్డి, హరినాథ్ పాల్గొన్నారు.