ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎస్‌ జైశంకర్‌

ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎస్‌ జైశంకర్‌
డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా (47వ అధ్యక్షుడిగా) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి  ఎస్‌ జైశంకర్‌ హాజరుకానున్నారు. ట్రంప్‌ ప్రమాణస్వీకార నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
దాంతో ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందే జైశంకర్‌ అమెరికాకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వెల్లడించింది.
ట్రంప్‌ వాన్స్‌ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, భారత్‌ తరఫున విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ హాజరుకానున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆయన అమెరికా పర్యటనలో ట్రంప్‌తో పాటు పలువురు అమెరికా ప్రతినిధులు, ఇతర నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొంది. 

కాగా, దీనికి ముందు గత డిసెంబర్ 24 నుంచి 29 వరకూ జైశంకర్ అమెరికాలో అధికార పర్యటన జరిపారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ట్రంప్ నామినీ మైఖేల్ వాల్ట్స్‌ను కలుసుకున్నారు. ట్రంప్ కొత్త అడ్మినిస్ట్రేషన్, భారత ప్రభుత్వం మధ్య జరిగిన తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలతో సహా పలు అంశాలపై జైశంకర్, వాల్ట్స్ ఈ సమావేశంలో చర్చించారు.

ట్రంప్-వాన్సె ఇనాగరల్ కమిటీ ఆహ్వానం మేరకు 47వ దేశాధ్యక్షుడుగా డొనాల్డ్ ఎస్.ట్రంప్ ప్రమాణస్వీకారానికి విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భారత్ తరఫున హాజరవుతున్నారని ఎంఈఏ తెలిపింది. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఆ దేశ 45వ అధ్యక్షుడిగా 2017 జనవరి నుంచి 2021 జనవరి వరకూ ఆయన తొలిసారి పగ్గాలు చేపట్టారు.

డొనాల్డ్​ ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా హాజరుకానున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్​ – జో బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి అప్పట్లో గైర్హాజరయ్యారు.