నూతన సంవత్సరం మద్యం అమ్మకాలకు ప్రభుత్వం భరోసా

నూతన సంవత్సరం మద్యం అమ్మకాలకు ప్రభుత్వం భరోసా
నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో నాలుగు పబ్బులకు అనుమతి నిరాకరించారు. హాట్‌కప్‌, అమినేషియా, బ్రాండ్‌వే, బేబీ లాండ్‌ పబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు రద్దుచేశారు.

అయితే, ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉంచనున్నారు. దీంతో తాగినోళ్లకు తాగినంత మందును విక్రయించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా క్లబ్‌లు, పబ్‌లకు భారీగా మద్యాన్ని తరలించారు. రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

నిరుడు డిసెంబర్‌లోనే అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఆ నెల చివరి వారంలో మద్యాన్ని ఏరులుగా పారించింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్‌ 28, 29, 30, 31 తేదీల్లో సుమారు రూ.771 కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు చేరింది. 

ఈ సారి డిసెంబర్‌ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా సుమారు 1,000 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిబంధనల్లో సడలింపు ఇవ్వనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకో సం ప్రతి జిల్లా, ప్రతి డివిజన్‌కు ప్రత్యేక టార్గెట్‌లు ఫిక్స్‌ చేసినట్టు సమాచారం.దసరాకు కూడా ఇదే తరహా ప్రణాళికలు అమలు చేయడంతో కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లు వచ్చాయి.  శనివారం నుంచి బుధవారం లోగా ఐదు రోజుల్లో రూ.1500 కోట్లకు తగ్గకుండా తాగించాలని, ఆ స్థాయిలో ఇప్పటికే అన్ని దుకాణాలకు మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం.