అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా బ్యాట్‌వుమెన్‌ సిమ్రాన్‌ షేక్‌

అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా బ్యాట్‌వుమెన్‌ సిమ్రాన్‌ షేక్‌
వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యుపీఎల్) 2025 సీజన్‌ కోసం బెంగళూరు వేదికగా ఆదివారం మినీ వేలం నిర్వహించారు. ఐదు జట్లు ఈ వేలంలో పాల్గొని 19 మందిని కొనుగోలు చేశాయి. ఇందు కోసం ఫ్రాంచైజీలు రూ.9.05కోట్లను వెచ్చించాయి. నలుగురు క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి.
 
 ఈ వేలంలో భారత అన్‌క్యాప్డ్ బ్యాట్‌వుమెన్‌ సిమ్రాన్‌ షేక్‌ పై గుజరాత్‌ జట్టు కోట్లు కుమ్మరించింది. రూ.1.90కోట్లకు గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు కొనుగోలు చేసింది. రూ.10 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సిమ్రాన్ బేస్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ పోటీపడ్డాయి. ఇక భారత్‌కు చెందిన 16 సంవత్సరాల జీ కమిలిని సైతం రికార్డు ధర ధక్కింది. రూ.10లక్షల బేస్‌ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన కమలినికి రూ.1.60కోట్లకు ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది. కమలిని తమిళనాడు జట్టు కీపర్‌.

యువ క్రీడాకారిణి కోసం ఢిల్లీ సైతం వేలంలో పోటీపడగా ధర భారీగా పెరిగింది. అక్టోబర్‌లో జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో కమలిని అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నది. ఎనిమిది మ్యాచుల్లో 311 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అదే సమయంలోనూ పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గాను సత్తాచాటగా.. వేలంలో ధర భారీగా పలికింది. 

ఇక వెస్టిండిస్‌ ఆల్‌రౌండ్‌ డియాండ్రా డాటిన్‌ను రూ. 1.75 కోట్లకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. రూ.50లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్‌ కోసం గుజరాత్‌, యూపీ పోటీపడగా.. చివరకు గుజరాత్‌ భారీ ధరకు తీసుకున్నది. అలాగే, భారత స్టార్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ అమ్ముడవలేదు. రూ.30 లక్షల బేస్‌ప్రైజ్‌తో వేలంలో ఎంట్రీ ఇవ్వగా.. ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అలాగే, ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్‌, టీమిండియా క్రీడాకారిణి, స్నేహ రాణాను సైతం ఫ్రాంచైజీలు తీసుకునేందుకు ఇష్టపడలేదు.

వేలంలో అమ్ముడయిన మహిళా క్రికెటర్లు

సిమ్రాన్‌ షేక్‌ : రూ.1.90కోట్లు, గుజరాత్‌ జెయింట్స్‌
డియాండ్రా డాటిన్ : రూ.1.70కోట్లు, గుజరాత్‌
జీ కమలిని : రూ.1.60 కోట్లు, ముంబయి ఇండియన్స్‌
ప్రేమ రావత్ : రూ.1.20కోట్లు, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
ఎన్ చరణి : రూ.55 లక్షలు, ఢిల్లీ క్యాపిటల్స్‌
అలన్నా కింగ్, రూ.30లక్షలు, యూపీ వారియర్స్
నదీన్ డీ క్లర్క్ : రూ.30 లక్షలు, ముంబయి ఇండియన్స్‌
డేనియల్ గిబ్సన్ : రూ.30లక్షలు, గుజరాత్ జెయింట్స్
అక్షితా మహేశ్వరి : రూ..20లక్షలు, ముంబయి ఇండియన్స్‌
నందిని కశ్యప్ : రూ.10 లక్షలు, ఢిల్లీ క్యాపిటల్స్‌
ఆరుషి గోయెల్ : రూ.10 లక్షలు, యూపీ వారియర్స్‌
క్రాంతిగౌర్‌ : రూ.10లక్షలు, యూపీ వారియర్స్‌
జోషిత : రూ.10 లక్షలు, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
సంస్కృతి గుప్తా : రూ.10 లక్షలు, ముంబయి ఇండియన్స్‌
సారా బ్రైస్ : రూ.10 లక్షలు, ఢిల్లీ క్యాపిటల్స్
ప్రకాశిక నాయక్, రూ.10లక్షలు, గుజరాత్ జెయింట్స్
రాఘవి బీస్ట్, రూ.10లక్షలు, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
జాగర్వి పవార్ : రూ.10లక్షలు, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
నిక్కీ ప్రసాద్, రూ.10లక్షలు, ఢిల్లీ క్యాపిటల్స్‌