సిమ్‌ లేకుండానే బీఎస్‌ఎన్‌ఎల్‌ వినూత్న సేవలు!

సిమ్‌ లేకుండానే బీఎస్‌ఎన్‌ఎల్‌ వినూత్న సేవలు!
 
దేశంలోని టెలికం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినూత్న సేవను ప్రారంభించనుంది. ‘డైరెక్ట్‌ టూ డివైజ్‌(డీ2డీ)’ సాంకేతికతను పరీక్షిస్తున్న ఈ సంస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా సిమ్‌ కార్డుల అవసరం లేకుండా, మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకపోయినా కాల్స్‌, మెసేజ్‌లు చేసుకోవచ్చు.

అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్‌ కంపెనీ వయాశాట్‌తో కలిసి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ కొత్త సేవను అభివృద్ధి చేసింది. ఇటీవల ముగిసిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో కొత్త లోగోను ఆవిష్కరించడంతో పాటు ఏడు కొత్త సేవలు అందుబాటులోకి తెస్తున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. ఇందులో ‘డైరెక్ట్‌ టూ డివైజ్‌’ సాంకేతికత ప్రధానమైనది.

నాన్‌-టెర్రెస్ట్రియల్‌ నెట్‌వర్క్‌(ఎన్‌టీఎన్‌) కనెక్టివిటీతో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించి ఈ టెక్నాలజీని పరీక్షిస్తున్నది. ఉపగ్రహం, ప్రాంతీయ మొబైల్‌ నెట్‌వర్క్‌లను అనుసంధానం చేయడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుంది. దీని కోసం అంతరిక్షంలోని ఉపగ్రహాలు మొబైల్‌ టవర్లలా ఉపయోగపడతాయి.

డీ2డీ ద్వారా సెల్యులార్‌, వైఫై నెట్‌వర్క్‌ లేని కొండకోనలు, సముద్రాలు, మారుమూల ప్రదేశాల నుంచి, విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌లు చేసేందుకు, మెసేజ్‌లు పంపేందుకు, యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలవుతుంది.