ప్రధాని మోదీని కలిసిన ఢిల్లీ సీఎం అతిషి

ప్రధాని మోదీని కలిసిన ఢిల్లీ సీఎం అతిషి
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానితో మొదటిసారి సమావేశమయ్యారు.  ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ లో సమావేశం గురించి పోస్ట్ చేశారు. మిగిలిన వివరాలు ఏవీ ఇవ్వలేదు.  ఎక్సైజ్ “స్కామ్” కేసులో జైలు నుండి విడుదలైన తరువాత పదవీకి రాజీనామా చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తర్వాత అతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ ముఖ్యమంత్రి నివాసం కేటాయింపుపై లెఫ్టనెంట్ గవర్నర్ వికె సక్సేనాతో విభేదిస్తున్న తరుణంలో ప్రధానితో సమావేశం జరిగింది. 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లా కేటాయింపుపై ప్రజలను “తప్పుదోవ పట్టించడానికి” ఆప్  “అత్యంత మోసపూరిత, దౌర్జన్య” కసరత్తులో నిమగ్నమైందని, నిబంధనలు, విధానాలను “పట్టించుకోక” పోవడం, “వాస్తవాలను దాచడం”కు పాల్పడినట్లు శనివారం లెఫ్టనెంట్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో ఆరోపణలు వెలువడ్డాయి. 
 
ముఖ్యమంత్రి అతిషికి బంగ్లా కేటాయించిన ఒక రోజు తర్వాత, సక్సేనా కార్యాలయం ఆమె కూడా ఈ కసరత్తులో భాగమని నిందించింది. అరవింద్ కేజ్రీవాల్ తొమ్మిదేళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా నివసించిన బంగ్లా నుండి నిష్క్రమించడం, తాజాగా దానిని అతిషికి కేటాయించడంపై ఆప్, బిజెపి, ఎల్‌జి కార్యాలయం మధ్య మాటల ఘర్షణ చెలరేగింది. 
 
“కేజ్రీవాల్ ఇంటిని అప్పగించి, అతిషీకి కేటాయించిన దాదాపు 48 గంటల వ్యవధిలో, నిబంధనలు, విధానాలను తారుమారు చేయడం ద్వారా, ఈ ప్రక్రియకు  సంబంధించిన వాస్తవాలను దాచడం, ఎల్‌జిని నిరంతరం దూషించడం  ద్వారా ఆప్, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ ప్రజలను, మొత్తం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే అత్యంత వంచక కసరత్తును ఆశ్రయించారు” అని ఆ ప్రకటన ఆరోపించింది.
 
అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాట్లాడుతూ, “ఎన్నికైన ప్రభుత్వంపై దూషణలు, ఆరోపణలతో నిండిన లెఫ్టనెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటనను చూడటం చాలా బాధాకరం. గత కొన్ని నెలలుగా ఆయన ఆపివేసిన అన్ని పనులను పునరుద్ధరించడానికి, వాటిని సరిచేయడానికి ఆప్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిలో నిమగ్నమై ఉంది. ఎల్జి చేసిన ఈ వ్యాఖ్యలకు నిజంగా స్పందించాల్సిన అవసరం లేదు” అని  చెప్పారు.