తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్‌ దర్యాప్తు

తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్‌ దర్యాప్తు
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో స్వతంత్ర విచారణకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.  తిరుమల శ్రీవారి లడ్డూ  ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది.
 
ఈ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు సరిపోదని, కేంద్రం తరపున అధికారిని నియమించాలని సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహ‍తా వాదించారు. పిటిషనర్లతో పాటు టీటీడీ, కేంద్ర ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్‌ సేఫ్టీ అధికారితో సిట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.  ఈ బృందాన్ని సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షించాలని తెలిపింది.
 
కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ధర్మాసనం విముఖత చూపింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. తిరుమల వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు, విమర‌్శలు చేయడానికి అనుమతించమని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఏమాత్రం అమోదయోగ్యం కాదని జస్టిస్ గవాయ్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు. దర్యాప్తు చేసిన తర్వాత దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని ధర్మాసనం ప్రకటించింది.  సొలిసిటర్‌ జనరల్ సైతం స్వతంత్ర దర్యాప్తు చేపడితేనే ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ధర్మాసనం తీర్పు వెలువడక ముందు.. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. సిట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు’’ అని తుషార్ మెహతా అన్నారు. ఈ మేరకు స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఓ టీవీ ఎడిటర్‌, విక్రమ్‌సంపత్‌ అనే భక్తుడు పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్‌) కొనసాగించాలా, లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచించింది.