మయన్మార్​ నుంచి 900 మంది మిలిటెంట్ల చొరబాటు

మయన్మార్​ నుంచి 900 మంది మిలిటెంట్ల చొరబాటు
రెండు జాతుల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనలతో ఏడాదిన్నర కాలంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది. మయన్మార్ నుంచి వందల సంఖ్యలో కుకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి అక్రమంగా చొబడినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్రంలో అధికారులు హై అలర్ట్‌  ప్రకటించారు.
 
మయన్మార్‌ నుంచి దాదాపు 900 మంది కుకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం 30 మంది సభ్యులతో కూడిన గ్రూపులుగా విడిపోయి రాష్ట్రంలో తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. 
 
ఈ నెల 28 నాటికి వీరంతా మైతీ గ్రామాలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకిస్తూ జాతీయ మీడియా నివేదించింది. వీరికి డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు, జంగిల్ వార్ ఫేర్ వాడకంలో శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించి.. భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
ఇంటెలిజెన్స్ నివేదికను తేలిగ్గా తీసుకోలేమని మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ స్పష్టం చేశారు. రిపోర్ట్​లో ఉన్నట్టు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించనంత వరకు దాన్ని నూటికి నూరు శాతం కరెక్ట్ అని తాము నమ్ముతున్నామని ఆయన తెలిపారు
 
. రాష్ట్రంలో డ్రోన్ వినియోగానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ను భద్రతా సంస్థలు అమలు చేయలేదని కుల్దీప్ సింగ్ తెలిపారు. అధికారుల అనుమతి లేకుండా ఈ పరికరాలను ఉపయోగించడాన్ని ఎస్ఓపీ నిషేధిస్తుంది. దక్షిణ మణిపూర్​లోని భారత్ -మయన్మార్ సరిహద్దుల్లోని జిల్లాల్లోని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లందరికీ గురువారం ఇంటెలిజెన్స్ నివేదిక అందింది.

మయన్మార్​లోని చిన్ స్టేట్​తో పాటు ఇతర రాష్ట్రాల్లోని సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మయన్మార్​తో భారత్ సరిహద్దును పంచుకుంటున్నందున, సరిహద్దుకు సమీపంలో కొన్ని హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. దీనికితోడు చిన్ స్టేట్ తిరుగుబాటుదారులు తమను ఆక్రమించుకున్న తర్వాత కొన్ని జుంటా దళాలు భారత్​లోకి చొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కోటాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం మైతీలు, కుకీ వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ని ఏడాది కాలంగా కుదిపేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం మరింత ఆందోళనకర విషయం. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అక్రమ వలసదారుల చొరబాట్లు పెద్ద ఎత్తున సాధ్యమయ్యాయి.

మరోవైపు భారత సైన్యం, మణిపూర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్​లో, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని కొండ ప్రాంతాలలో పెద్ద మొత్తంలో ఇంప్రొవైజ్డ్ ఎక్స్​ప్లోజివ్​ డివైజెస్ (ఐఈడీ)ని ఇటీవలే అధికారులు స్వాధీనం చేసుకున్నారు.