కవిత బెయిల్ తర్వాత రేవంత్ వాఖ్యలపై సుప్రీం ఆగ్రహం

కవిత బెయిల్ తర్వాత రేవంత్ వాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు బెయిల్ పై విడుదల కావడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య డీల్ కుదరడంతోనే బెయిల్ వచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నిందితులకు తాము బెయిల్ ఇస్తామా? అని ప్రశ్నించింది. 
 
2015 నాటి ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బైఆర్‌ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయమూర్తులు తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తరపున వాదించిన లాయర్లు ప్రశ్నించారు. 
 
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవంతో ఉండాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సరికాదని కోర్ట్ వ్యాఖ్యానించింది. ‘‘ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి సీఎం పదవిలో ఉన్నారు. కాబట్టి కేసును బదిలీ చేయాలంటూ పిటిషనర్ కోరినట్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటారా?’’ అంటూ అడ్వకేట్లు ముకుల్ రోహత్గీ, సిద్దార్థ్ లూథ్రాలను న్యాయమూర్తులు ప్రశ్నించారు. మరోసారి ఇలా జరగదని వారు కోర్టుకు హామీ ఇచ్చారు.ఆయన (ముఖ్యమంత్రి) చేసిన ప్రకటనలు బహిరంగంగా ప్రచురితమయ్యాయని, పోలీసులు ఏదైనా చేస్తే వారిని వీధిలో కొడతారేమో అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఆయన ఏమన్నారో మీరు చదివారా? ఒకసారి చదవండి. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అనుమానాలు కలగజేస్తాయి’’ అని జస్టిస్ గవాయి స్పష్టం చేశారు.
‘‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయాలా?. రాజకీయ నాయకులు, న్యాయ వ్యవస్థ మధ్య పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయ కారణాలతో మేము ఆదేశాలు జారీ చేశామని ఏ వ్యక్తైనా ఎలా చెప్పగలరు?. మీరు మమ్మల్ని గౌరవించనంత మాత్రాన మేము మీ కేసు విచారణను వేరే చోటికి బదిలీ చేస్తామా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. “ఇది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. నిన్ననే మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శికి (అటవీ, రెవెన్యూ శాఖ) నోటీసులు జారీ చేశాం. ఏదైనా రాజకీయ పార్టీని సంప్రదించిన తర్వాత మా ఆదేశాలను జారీ చేస్తామా?. మనస్సాక్షి, ప్రమాణం చేసిన విధంగా మేము మా విధులను నిర్వహిస్తాం’’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమ ఆదేశాల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చినా తామేమీ బాధ‌ప‌డ‌మ‌ని, కానీ తాము త‌మ అంత‌రాత్మ ప్ర‌కార‌మే విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటామ‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. కాగా ఓటుకు నోటు కేసు బదిలీపై విచారణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయగలరని, సాక్ష్యాలను తారుమారు చేయగలరని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు.  ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేత జగదీశ్‌ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేశారు.

విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం తెలిపింది. సిఎం రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న 2015లో ఓటుకు నోటు కేసులో విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.  తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

కాగా, బుధవారం కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగానే “కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసింది నిజం. బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లలో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది నిజం కాదా? ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా?” అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.