వారంలో రోజుల్లో చంపై సోరెన్ కొత్త పార్టీ

వారంలో రోజుల్లో చంపై సోరెన్ కొత్త పార్టీ
వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ వెల్లడించారు. అలాగే కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళిక గురించి చంపై సోరెన్ బుధవారం స్పష్టత ఇచ్చారు. 
 
కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘మూడు అవకాశాల గురించి నేను ప్రస్తావించా. పదవీ విరమణ, కొత్త పార్టీ లేదా వేరే పార్టీలో చేరిక. నేను పదవీ విరమణ చేయను. కొత్త పార్టీని బలోపేతం చేస్తా. మంచి స్నేహితుడిని కలిస్తే వారితో కలిసి ముందుకు సాగుతా’ అని తెలిపారు. పరోక్షంగా కొత్త పార్టీ ఏర్పాటు చేసుకొని బీజేపీతో పొత్తు ఏర్పర్చుకోనున్నట్లు సంకేతం ఇచ్చారు.

కాగా, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీని స్థాపించడానికి ఎక్కువ సమయం లేదన్న మీడియా ప్రశ్నకు చంపై సోరెన్ ‘అది మీ సమస్య కాదు’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘ఒక రోజులో 30,000 నుంచి 40,000 మంది కార్యకర్తలు చేరుకోగలరు. కొత్త (రాజకీయ) పార్టీని ఏర్పాటు చేయడంలో నాకు ఏ సమస్య ఉంటుంది? వారంలోగా పార్టీని ఏర్పాటు చేస్తా’ అని స్పష్టం చేశారు.

మరోవైపు తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం అంకితం చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని చంపై సోరెన్ ఆరోపించారు. సీఎంగా తన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తనకు చెప్పకుండా రద్దు చేయడం చాలా అంసతృప్తిని కలిగించిందని చెప్పారు.  తనకు అధికారంపై అత్యాశ లేదని, అందుకే ఆత్మగౌరవం దెబ్బతినే వరకు మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే చాలా అవమానాల తరువాత ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతకవలసి వచ్చిందని తెలిపారు. ‘ఈ రోజు నుంచి నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని చెప్పారు.