ఉదంపూర్‌లో కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరమరణం

ఉదంపూర్‌లో కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరమరణం
జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో సోమవారం సీఆర్పీఎఫ్‌ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్‌స్పెక్టర్‌ వీరమరణం పొందినట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
 
ఉదంపూర్‌లోని రామ్‌నగర్లోని చీల్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ బృందం సాధారణ పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుల్దీప్‌ వీరమరణం పొందారని ఓ అధికారి తెలిపారు. అయితే, ఉగ్రవాదులకు స్థానికులు సహకారం అందిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.
 
ఇంతకు ముందు 7న ఉదంపూర్‌లోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.  ప్రతికూల వాతావరణం, పొగమంచులో ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఉదంపూర్‌లోని బసంత్‌పూర్‌ ఎగువన ఉన్న అటవీ ప్రాంతంలో గత కొద్దినెలలుగా ఉగ్రవాదులు దాక్కున్న ట్లుగా భావిస్తున్నారు.  అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై బలగాలకు సమాచారం అందుతున్నది. 
 
అయితే, సహాయం అందించే వారు లేకపోతే అటవీ ప్రాంతంలో ఇంతకాలం దాక్కోవడం సాధ్యం కాదని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. సమాచారం మేరకు ఉగ్రవాదులు స్థానికంగా ఏదో ఒక ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారని ప్రస్తుతం అడవులు, పర్వతాలు గుజ్జర్‌, బకర్వాల్‌లో అనేక శిబిరాలు ఉన్నట్లుగా అంచనా. ఉగ్రవాదులు బెదిరింపులకు పాల్పడుతూ భోజన ఏర్పాట్లు చేసుకుంటున్నారనే అనుమానాలు సైతం ఉన్నాయి. గత ఏప్రిల్‌ నుంచి ఈ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం ఉన్నది.