థాయ్‌లాండ్‌ నూతన ప్రధాని షినవత్రాకు మోదీ శుభాకాంక్షలు

థాయ్‌లాండ్‌ నూతన ప్రధాని షినవత్రాకు మోదీ శుభాకాంక్షలు
థాయ్‌లాండ్‌ మాజీ ప్రధాని థాక్సిన్ కుమార్తె పెటోంగ్‌టార్న్ షినవత్రా ( ఆ దేశ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. థాయ్‌లాండ్ పార్లమెంట్‌ ఆమెను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. 37 ఏళ్ల వయస్సులో ప్రధాని అయిన ఆమె.. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. 
 
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం థాయ్‌ నూతన ప్రధానికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.  షినవత్రా విజయవంతంగా తన పదవీకాలం నిర్వహించాలని ఆకాంక్షించారు. భారత్‌, థాయ్‌లాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, తమతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. 
 
పెటోంగ్‌టార్న్ షినవత్రా కంటే ముందు ఆమె అత్త యింగ్లక్ కూడా థాయ్‌లాండ్‌ ప్రధానిగా పనిచేశారు. ఆమె తర్వాత థాయ్‌లాండ్‌ ప్రధాని పదవి చేపట్టిన రెండో మహిళ పెటోంగ్‌టార్న్ కావడం గమనార్హం. ఆమె మాజీ ప్రధాని తక్సిన్‌ షినవత్ర కుమార్తె. షినవత్ర కుటుంబంలో ఈ పదవిని చేపట్టినవారిలో పెటోంగ్టార్న్‌ మూడో వ్యక్తి. థాయ్‌లాండ్‌ ప్రధాని శ్రేతా తవిసిన్‌ను ఇటీవల రాజ్యాంగ న్యాయస్థానం తొలగించింది. ఆ తర్వాత రెండు రోజులకు షినవత్రా ప్రధానిగా ఎంపికైంది. ఇద్దరూ ఫ్యూ థాయ్ పార్టీకి చెందినవారు. ప్రధాని పదవిని చేపట్టడానికి దిగువ సభలో కనీసం 247 మంది సభ్యుల మద్దతు అవసరం.

ఫ్యూ థాయ్‌ పార్టీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమికి 314 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరు పెటోంగ్టార్న్‌కు మద్దతు తెలిపారు. ఆమె నేతృత్వంలో ఈ కూటమి మరింత బలపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.  ప్రధాని పదవి నుంచి స్రేట్ట తవిసిన్‌ను బుధవారం కోర్టు తొలగించడంతో ఈ ఎన్నిక అవసరమైంది. ఆయన నైతిక నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లు కోర్టు తీర్పు చెప్పింది.