ఆసుపత్రులపై దాడి చేస్తే 6 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి

ఆసుపత్రులపై దాడి చేస్తే 6 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి

* వైద్య విద్యార్థులలో నలుగురిలో ఒకరికి మానసిక సమస్యలు

ఆస్పత్రుల్లో హింసాత్మక ఘటనలు జరిగిన ఆరు గంటల్లోగా సంస్థాగత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఎఫ్ఐఆర్) నమోదు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం మెమోరాండం జారీ చేసింది. ‘‘విధి నిర్వహణలో ఉన్న ఆరోగ్య కార్యకర్తపై ఏదైనా హింస జరిగితే, సంఘటన జరిగిన గరిష్టంగా 6 గంటల్లోపు సంస్థాగత ఎఫ్ఐఆర్  దాఖలు చేయడానికి సంస్థ అధిపతి బాధ్యత వహిస్తారు’’ అని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై హింస సర్వసాధారణంగా మారిందని యూనియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్ఎస్) కు చెందిన అతుల్ గోయల్ సంతకం చేసిన ఈ మెమోరాండంలో పేర్కొన్నారు. ‘‘విధి నిర్వహణలో పలువురు ఆరోగ్య కార్యకర్తలు మానసికంగా, శారీరకంగా గాయాల పాలయ్యారు. చాలా మందిని బెదిరించారు లేదా మాటల దాడికి గురిచేశారు. ఈ హింసలో ఎక్కువ భాగం రోగులు లేదా రోగుల బంధుమిత్రులే చేశారు’’ అని తెలిపారు.

కలకత్తాలోని ఆర్జీ కర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పై బుధవారం రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది.  కాగా, వైద్య విద్యార్థులు విపరీతమైన ఒత్తిడితో చిత్తవుతున్నారని, మానసిక సమస్యల బారిన పడుతున్నారని జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) నివేదిక పేర్కొన్నది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థుల్లో ఒకరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రతి ముగ్గురు పీజీ విద్యార్థుల్లో ఒకరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపింది. 

ఎన్‌ఎంసీ ఏర్పాటుచేసిన ‘నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌బీయింగ్‌’ వైద్య విద్యార్థులపై ఏప్రిల్‌ 26 నుంచి మే 6 వరకు ఒక ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది.  ఇందులో 25,590 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌, 5,337 మంది పీజీ వైద్య వైద్యార్థులు, 7,035 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. యూజీ విద్యార్థుల్లో 27.8 శాతం, పీజీ విద్యార్థుల్లో 15.3 శాతం మంది తాము మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు స్వచ్ఛందంగా తెలిపారని ఈ నివేదిక పేర్కొన్నది.

యూజీ విద్యార్థుల్లో 16.2 శాతం మంది, పీజీ విద్యార్థులు 31.2 శాతం మందికి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్టు ఈ నివేదిక తెలిపింది. గత ఏడాదిలో 564 మంది పీజీ విద్యార్థులు తాము ఆత్మహత్య చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నామని, 237 మంది పీజీ విద్యార్థులు ఆత్మహత్యకు ప్రయత్నించామని సైతం సర్వేలో ఒప్పుకున్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. ఇలాంటి ఆలోచనలు ఉన్న వారిలో కొందరు మానసిక వైద్య సహాయాన్ని ఆశిస్తుండగా, ఇంకొందరు వద్దనుకుంటున్నారు.