వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు!

వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న మహిళా కమిషన్‌ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది.

మరో వైపు వేణుస్వామికి మద్దతుగా ఆయన భార్య వీణా వాణి వీడియో విడుదల చేసింది. మీడియాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వేణుస్వామి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

2027లో ఇద్దరు విడిపోతారంటూ వ్యాఖ్యానించారు. గతంలో సమంత, నాగ చైతన్య జంట సైతం విడిపోతారంటూ బయటపెట్టారు. ఆ తర్వాత పలు విషయాలపై జాతకాలు చెప్పినా ఏ ఒక్కటి జరుగలేదు.  ఇదిలా ఉండగా.. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌, తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. 

గతంలో సినిమాల విడుదల, రాజకీయాలు ఇలాంటి వ్యాఖ్యలు చేసి అబాసుపాలైనా ఆయనకు బుద్ధి రాలేదని.. వ్యక్తిగత విషయాలపై నలుగురిలో మాట్లాడకూడదనే జ్ఞానం లేకుండా వేణుస్వామి వాళ్లు విడిపోతారంటూ వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. 

దీనికి స్పందించిన మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌ నేరెళ్ల శారద వేణుస్వామిని పిలిపించి వివరణ కోరుతామని పేర్కొన్నారు. టెలికాస్ట్‌ చేసిన యూట్యూబ్‌ ఛానెల్స్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే వేణుస్వామికి మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.