పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో 4% వడ్డీకి రూ.3 లక్షల

పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో 4% వడ్డీకి రూ.3 లక్షల
కేంద్ర ప్రభుత్వం పశుసంవర్ధక రైతులకు రాయితీపై రుణాలు అందిస్తుంది. రైతుల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అమలు చేస్తుంది. ఈ కార్డు ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, రొయ్యల పెంపకం..కింద రైతులకు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంది. పశుసంవర్ధక రైతులకు ప్రోత్సాహం అందించేందుకు భారత ప్రభుత్వం ‘పశు కిసాన్ కార్డు’ని ప్రారంభించింది. 
 
పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పశుపోషణ, చేపల పెంపకానికి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ ను బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తుంది. ఈ పథకం కింద పశువుల పెంపకందారులకు రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తారు. రూ.1.6 లక్షల వరకు రుణాలకు ఎలాంటి హామీ అవసరం లేదు.

రైతులకు అవసరమైన సమయాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లకు సులభంగా రుణాలు పొందవచ్చు. బయట ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు సహాయపడతాయి. పశువుల పెంపకందారులు ఈ కార్డును డెబిట్ కార్డుగా కూడా ఉపయోగించవచ్చు. అలాగే రైతులు తమ భూమి లేదా ఇతర ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక గేదెకు రూ.60,000, ఒక ఆవుకు రూ.40,000, ఒక కోడికి రూ.720 మరియు ఒక గొర్రె లేదా మేకకు రూ.4000 రుణం అందిస్తుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పశు కిసాన్ క్రెడిట్ కార్డుదారుడికి 4 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుంది. 

పశువుల పెంపకందారులు ఆరు వాయిదాల్లో రుణం మంజూరు చేస్తారు. ఈ రుణాన్ని రైతులు ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు రైతులకు 7 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తుంటాయి. అయితే పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు ప్రభుత్వం 3 శాతం రాయితీ లభిస్తుంది. రైతులు తీసుకున్న రుణంపై 4 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.