అగ్రిగోల్డ్ భూముల స్వాహా కేసులో జోగి రమేష్ ఇంట్లో ఎసిబి సోదాలు

అగ్రిగోల్డ్ భూముల స్వాహా కేసులో జోగి రమేష్ ఇంట్లో ఎసిబి సోదాలు
అగ్రిగోల్డ్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ మంత్రి జోగిరమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఏసీబీ మంగళవారం తెల్లవారు జాము నుండి సోదాలు చేపట్టింది. తాజాగా ఈ ఘటనపై సిఐడి కేసు నమోదు చేసింది. నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటంతో వారిపై ఏసీబీ సెక్షన్లతో కేసులు నమోదు చేశారు.
 
విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్‌ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని సిఐడి గతంలో జప్తు చేసింది. అదే సర్వే నంబర్లలో ఉన్న భూమిని కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ అగ్రిగోల్డ్‌కు చెందిన భూమిని కబ్జా చేశాడు. ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం రెండు వారాల క్రితం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. 
 
దీంతో ఏపీ సీఐడి చర్యలు ప్రారంభించింది. సీఐడీ జప్తులో ఉన్న భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో 9మందిపై కేసులు నమోదు చేశారు. దాదాపు పది రోజుల క్రితమే జోగిరమేష్ కుమారుడు రాజీవ్‌, బాబాయ్ వెంకటేశ్వర రావుతో పాటు మరో ఏడుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించడంతో నిందితులపై ఏసీబీ సెక్షన్లను కూడా నమోదు చేశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహ‍న రాందాసు, వెంకటసీతామహాలక్ష్మీ, గ్రామ సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్‌, డిప్యూటీ తాసీల్దార్ విజయ్‌కుమార్, విజయవాడ రూరల్ తాసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు ఉన్నారు.

నిందితుల్లో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ ప్రమేయంతోనే వీరంతా కలిసి అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేయడానికి సహకరించినట్టు సిఐడి గుర్తించింది. లేని భూమికి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమానికి తెరతీశారు. ఈ దందాలో మండల సర్వేయర్‌ రమేష్‌ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు.

ఖాతాదారుల్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ డిపాజిట్ల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు సాగుతుండగానే జప్తు చేసిన భూముల్ని కబ్జా చేసేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో దాదాపు 3వేల గజాల భూమిని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి తనయుడి పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు.

ఖాతాదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో 2015 నుంచి కేసులు నమోదు అవుతున్నాయి. నాలుగైదు రాష్ట్రాల్లో విస్తరించిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్‌ వ్యవస్థాపకులు సంపాదించిన స్థిర, చరాస్తుల్ని సిఐడి జప్తు చేసింది. అగ్రిగోల్‌ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న భూముల్ని సిఐడి జప్తు చేసింది.

అలాంటి భూముల్లో విజయవాడ రూరల్‌ మండలం సర్వే నంబర్ 87లో ఉన్న 3వేల గజాల భూమి కూడా ఉంది. అగ్రిగోల్డ్ వ్యవస్థాపకుడు అవ్వా రామారావు తండ్రి అప్పారావు పేరిట ఈ భూమిని 2002లో కొనుగోలు చేశారు. ఆయన తన మనుమళ్ల పేరిట ఆ భూమిని రిజిస్టర్ చేశారు. 2005లో సర్వే నంబర్ 88 పేరుతో 3వేల గజాల భూమిని ఒకరు రిజిస్ట్రేషన్ జరగ్గా దానిని మాజీ మంత్రి కుమారుడు కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ క్రమంలో అవ్వా అప్పారావుకు చెందిన 3వేల గజాల భూమినే తమ భూమి పేర్కొంటూ ఫెన్సింగ్ వేశారు.