భారత్ పట్ల మాల్దీవుల అధ్యక్షుడి సానుకూల ధోరణి 

భారత్ పట్ల మాల్దీవుల అధ్యక్షుడి సానుకూల ధోరణి 
మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన మహమ్మద్‌ ముయిజ్జు ఇప్పుడు సానుకూల వ్యాఖ్యలు చేయడం విస్మయం కలిగిస్తున్నది. మాల్దీవులు సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్‌ ఒకటని, ముఖ్యమైన భాగస్వామి అని చెప్పడమే కాకుండా తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయంలో ముందుంటుందని కొనియాడారు.
 
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూతో శనివారం సమావేశమయ్యారు. భారత్, మాల్దీవుల మధ్య తెగిపోతున్న సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా జైశంకర్ పర్యటన సాగింది. సమావేశం అనంతరం ముయిజ్జు మాట్లాడుతూ తమ దేశానికి నిత్యం సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భద్రత, అభివృద్ధి, సాంస్కృతిక విషయాల్లో పరస్పర సహకారం ద్వారా ఢిల్లీ, మలే మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు

  మాల్దీవుల్లోని 28 ద్వీపాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సౌకర్యాల కల్పనకు భారత్‌ సహకరించింది. ఇందుకోసం ఎగ్జిమ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో రుణాన్ని అందించింది. ఈ నేపథ్యంలో మాల్దీవులు అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మైలురాయి అని తెలిపారు.

“ఇవాళ జైశంకర్‌ని కలవడం, మాల్దీవుల్లోని 28 ద్వీపాలలో మురుగునీటి ప్రాజెక్టుల సహకారానికి భారత్ ముందుకు రావడం శుభపరిణామం. మాల్దీవులకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. భద్రత, అభివృద్ధి, సాంస్కృతిక మార్పిడిలో పరస్పరం సహకరించుకుంటే ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. మేం కలిసి ఇరు దేశాల ఉజ్వల భవిష్యత్తును నిర్మిస్తాం” అని ముయిజ్జు ఎక్స్‌లోని ఓ పోస్ట్‌లో తెలిపారు.

భారత్‌తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. గతంలోనూ రుణ విముక్తి కోసం ముయిజ్జు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్‌ డాలర్లు బకాయిపడింది. దీన్ని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని కొద్ది నెలల క్రితం ద్వీప దేశం ప్రాదేయపడింది. అందుకు భారత్‌ అంగీకరించింది. 

ఇదిలావుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ముయిజ్జు హాజరయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ లో పర్యటించిన సమయంలో మాల్దీవుల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. దాంతో సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

`బాయ్‌కాట్ మాల్దీవ్స్‌’ పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవులు ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అనంతరం సదరు మంత్రులపై వేటు వేసింది.

విభేదాలు ముదురుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ మన దేశానికి వచ్చి ‘ఆ నేతలు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదు. అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులకు వెళ్లారు. ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’ అనే భారత పాలసీలో మాల్దీవులకు ముఖ్యపాత్ర ఉందని చెప్పారు.