ఉక్రెయిన్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. 23న జెలెన్‌ స్కీతో సమావేశం!

ఉక్రెయిన్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. 23న జెలెన్‌ స్కీతో సమావేశం!
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే ఈ పర్యటనకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఇంకా స్పష్టతనివ్వలేదు. 
 
గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఇరువురు నేతలు కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ తాజా పరిస్థితులపై చర్చించారు. కాగా, మోదీ ఈ నెల 8న రష్యాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్‌కు వెళ్తుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
 
జూన్‌ 8న రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని పుతిన్‌ అందజేశారు. ఇండియా- రష్యా 22వ వార్షిక సమావేశం సందర్భంగా ప్రధానిని రష్యాలో పర్యటించాలని పుతిన్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే. 
 
కాగా, ఉక్రెయిన్‌పై 2022, ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభించింది. మూడు వారాల్లో ఆ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించుకోవాలని పుతిన్‌ సైన్యం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఉక్రెయిన్‌కు నాటో దేశాల మద్దతుతో మూడు వారాలు అనుకున్న యుద్ధం రెండున్నర ఏండ్లుగా కొనసాగుతూనే ఉన్నది. 
 
ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి యుద్ధం మార్గం కాదని, చర్చల తోనే శాంతి నెలకొంటుందని రష్యా, ఉక్రెయిన్‌కు ప్రధాని మోదీ పలుమార్లు సూచించారు.