మణిపూర్‌లో బాంబులతో ఓ భవనం కూల్చివేత

మణిపూర్‌లో బాంబులతో ఓ భవనం కూల్చివేత
మణిపూర్‌లో ఒక భవనాన్ని బాంబులతో కూల్చివేశారు. కుకీ తెగల ప్రాబల్యం ఉన్న ప్రాంతం నుంచి పారిపోయిన మైతేయి కుటుంబానికి చెందిన ఇల్లు అది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రెండు వర్గాల మధ్య అల్లర్లతో అట్టుడుగుతున్న చురచంద్‌పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది మేలో మణిపూర్‌లో కుకీ, మైతేయి జాతుల మధ్య హింస చెలరేగింది. 
 
ఈ నేపథ్యంలో 43 ఏళ్ల నౌరెమ్ ఇబోమ్చా మైతేయి ప్రాణ భయంతో ఇంటిని వీడి కుటుంబంతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే చురచంద్‌పూర్‌లో అతడికి చెందిన నాలుగు అంతస్తుల బిల్డింగ్‌ను బాంబులతో కూల్చివేశారు.  తన కుటుంబం నిర్మించిన ఇంటిని కుకీలు కూల్చివేశారని నిరాశ్రుయుడైన నౌరెమ్ తెలిపాడు. సహాయ సేవల్లో ఉన్న స్నేహితుడు ఈ విషయాన్ని తనకు చెప్పాడని పేర్కొన్నాడు. 
 
గత ఏడాది మే, సెప్టెంబర్‌ మధ్యలో ఇది జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వీడియో క్లిప్‌ను తాను చూడటం ఇదే మొదటిసారి అని ఆవేదన వ్యక్తం చేశాడు. మైతీల ఇళ్లను కూల్చివేయడాన్ని భద్రతా బలగాలు అడ్డుకోలేదని ఆరోపించారు. చురచంద్‌పూర్‌లోని మైతీలంతా ఈ విధంగా తుడిచిపెట్టుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు.మరోవైపు చురచంద్‌పూర్‌లో నౌరెమ్ కుటుంబం ఎనిమిదేళ్లపాటు లైసెన్స్ పొందిన గన్స్‌, ఆయుధాల షాపు నిర్వహించింది. 2019 జూన్‌లో ఆ షాప్ యజమాని నౌరెమ్, మోరే నుంచి ఇంఫాల్‌కు అధునాతన రైఫిల్ స్కోప్‌లను రవాణా చేస్తుండగా అస్సాం రైఫిల్స్ అదుపులోకి తీసుకున్నారు.

కాగా, 2023 మేలో ఘర్షణలు చెలరేగిన రోజున కుకీ అల్లరి మూకలు ఆ గన్స్‌ షాపులోకి ప్రవేశించాయి. గన్స్‌, ఆయుధాలను దోచుకున్నాయి. ఆ తర్వాత ఆ షాపును ధ్వంసం చేశాయి. అనంతరం నౌరెమ్‌ పుర్వీకులకు చెందిన ఇంటి భవనాన్ని కుకీ మూకలు పేల్చివేశాయి. ఈ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.