యూపీఎస్‌సీ చైర్మెన్ మ‌నోజ్ సోనీ రాజీనామా

యూపీఎస్‌సీ చైర్మెన్ మ‌నోజ్ సోనీ రాజీనామా
యూపీఎస్‌సీ చైర్మెన్ మ‌నోజ్ సోనీ రాజీనామా చేశారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల రాజీనామా చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అయితే ఆ రాజీనామాను ఇంకా అంగీక‌రించ‌లేద‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. మ‌నోజ్ సోనీ రాజీనామాకు చెందిన మ‌రిన్ని విష‌యాలు అందాల్సి ఉన్న‌ది.

రాజీనామాను ఆమోదించ‌డం చాలా సుదీర్గ‌మైన ప్రకియ అని తెలిసింది. ప్ర‌స్తుతం ఫోన్ కాల్స్‌కు ఆయ‌న స్పందించ‌డంలేదు. అయిదేళ్ల ముందే మ‌నోజ్ సోనీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2029 వ‌ర‌కు సోనీ ఆ ప‌దవిలో కొన‌సాగాల్సి ఉన్న‌ది. 2017 నుంచి యూపీఎస్సీలో సోనీ స‌భ్యుడిఆ ఉన్నారు. 

2023, మే 16వ తేదీన యూపీఎస్సీ చైర్మెన్‌గా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అయితే, సోనీ రాజీనామాకు, ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్క‌ర్ వివాదంతో లింకు లేద‌ని కొన్ని అధికారవర్గాలు స్పష్టం చేశాయి. 15 రోజుల క్రితం రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు  సమర్పించారని, కేంద్ర ప్రభుత్వం రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలిపారు. 

సోనీ యూపీఎస్సీ ఛైర్మన్‌గా ఉండటానికి ఆసక్తి చూపడం లేదని, రిలీవ్ కావాలనుకుంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజీనామా అనంతరం సామాజిక సేవ, మతపరమైన కార్యకలాపాలకు అంకితం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే సోనీ పదవీకాలం 2029తో ముగియనుంది. యూపీఎస్సీ క‌న్నా ముందు ఆయ‌న మూడుసార్లు వైస్ ఛాన్స‌ల‌ర్‌గా చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మకస్తుడిగా పేరున్న ఆయన  2005 ఏప్రిల్ నుంచి 2008 ఏప్రిల్ వరకు బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంకు సోనీ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు.  1991 – 2016 మధ్య కాలంలో సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం, వల్లభ్ విద్యానగర్‌లో అంతర్జాతీయ సంబంధాల పాఠాలను బోధించారు. జరాత్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా ఆగస్టు 1, 2009 నుంచి జులై 31, 2015 వరకు వరుసగా రెండు పర్యాయాలు విధులు నిర్వహించారు.