సిబిఐ దర్యాప్తుపై మమతా సర్కార్‌కు సుప్రీంలో చుక్కెదరు

సిబిఐ దర్యాప్తుపై మమతా సర్కార్‌కు సుప్రీంలో చుక్కెదరు
* బెంగాల్‌లో వీసీల ఎంపికకు సుప్రీం కమిటీ
సందేశ్‌ఖాలీలో భూ ఆక్రమణలు, మహిళలపై దాడులు వంటి నేరాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ బెంగాల్ సర్కార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. 
 
విచారణను నిలిపివేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణ కొనసాగనుంది  సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం సూటిగా బెంగాల్ సర్కార్ తరఫు న్యాయవాదికి ఒక ప్రశ్నను సంధించింది. 
 
”ఎవరో ఒక వ్యక్తిని రక్షించేందుకు ప్రభుత్వం ఎందుకు ఆసక్తిగా ఉంది?” నిలదీసింది. పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు ధర్మాసనం పేర్కొంది. దీనికి ముందు ఏప్రిల్ 29న విచారణ సమయంలోనూ కొందరు ప్రైవేటు వ్యక్తులను ఎందుకు రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
 
సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడం వల్ల ఇటు పోలీసు బలగాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ్రం నైతిక స్థైర్యం దెబ్బతింటుందని బెంగాల్ ప్రభుత్వం తన పిటిషన్‌లో వాదించింది. సందేశ్‌ఖాలీ ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు కోల్‌కతా హైకోర్టు ఏప్రిల్ 10న ఆదేశాలు జారీ చేసింది. 
 
సమగ్ర నివేదకను తదుపరి విచారణలో తమకు సమర్పించాలని కూడా సీబీఐని ఆదేశించింది. కాగా, జనవరి 5న సందేశ్‌ఖాలీలో ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి 3 ఎఫ్ఐఆర్‌లను కూడా నమోదు చేసింది.