ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్
ఎక్సైజ్ స్కామ్‌కు సంబంధించిన కేసులో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థకు డిల్లీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. సీబీఐ అధికారిక దరఖాస్తును అనుసరించి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు అనుమతినిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి ఉదయం కోర్టుకు తీసుకొచ్చారు.

కేజ్రీవాల్ ను కస్టడీకి కోరుతూ సీబీఐ దరఖాస్తు చేసింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దేశ కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారికంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన అరెస్ట్‌కు కోర్టు బుధవారం అనుమతించడంతో రౌస్ అవెన్యూ కోర్టులోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అధికారులు.. కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ కేసులో ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కిందటి గురువారం మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంపై ఈడీ ఢిల్లీ హైకోర్డు మెట్లుఎక్కింది. తమ వాదనాలకు సరైన సమయం ఇవ్వలేదని పేర్కొంది. విచారణ చేసిన ఢిల్లీ న్యాయస్థానం ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన విషయం తెలిసిందే.

మరోవైపు ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ ఆపరేషన్‌పై మధ్యంతర స్టే మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. కేజ్రీవాల్‌ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ సవాల్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

పిటిషన్ ఉపసంహరించుకుంటామని కేజ్రీవాల్ కోరగా.. అందుకు అత్యున్నత జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిల ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. హైకోర్టు పూర్తిస్థాయి ఉత్తర్వులు, సీబీఐ అరెస్టు వంటి పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేస్తామని కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు.